రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ భవనం లోపల డిజైన్లు ఎలా ఉండాలో నిర్ణయించడానికి స్పీకర్ అధ్యక్షతన ఒక కమిటీ నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. భవనం భౌతిక డిజైన్ ఇప్పటికే పూర్తయినందున అందులో మార్పులు ఉండవని.. లోపల ఎలా ఉండాలో.. ఏయే అవసరాలకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలో కమిటీలో చర్చించి సూచనలు ఇవ్వాలని సీఎం చెప్పారు. అసెంబ్లీ భవనం పైన ఉండే టవర్ విజయవాడ, గుంటూరు నుంచి కూడా కనిపిస్తుందని, ఇంత పెద్ద టవర్ దేశంలో మరే అసెంబ్లీకి లేదని తెలిపారు. 47 అంతస్థులతో నిర్మించబోయే సచివాలయ టవర్లో ప్రతి శాఖ మంత్రి, కార్యదర్శి, శాఖాధిపతి ఒకేచోట ఉండేలా చూడాలని ఆదేశించారు. శాఖాధిపతులకు సందర్శకుల తాకిడి ఉంటుందని, వాటిని వేరేచోట పెడితే బాగుంటుందని మంత్రి లోకేశ్ అన్నారు. ఇందుకు సీఎం అంగీకరించలేదు. గిరిజన వర్సిటీ కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన స్థలాన్ని గత జగన్ సర్కారు మార్చిందని.. అక్కడే నిర్మాణం కొనసాగిద్దామని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు జనవరిలో ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. హడ్కో రుణంతో చేపట్టే పనులు సంక్రాంతి తర్వాత మొదలవుతాయని, ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టే పనులు ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతాయని వివరించారు. ఈ రెండు మార్గాల నుంచి అందే నిధులు రూ.31వేల కోట్లు ఉంటాయని, చాలా పనులు వీటితోనే పూర్తవుతాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa