ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్సంబంధాలను పటిష్ట పరచడమే లక్ష్యంగా..నరేంద్ర మోదీ

national |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 04:28 PM

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అనేక దేశాల్లో పర్యటించారు. ముఖ్యంగా యుద్ధంలో ఉన్న రష్యా, ఉక్రెయిన్‌లను సందర్శించారు. అదే విధంగా అమెరికాలో కూడా పర్యటించారు. ఏ దేశానికి వెళ్ళినా, ఆ దేశ ప్రజలు-భారతీయుల మధ్య సత్సంబంధాలను పటిష్ట పరచడమే లక్ష్యంగా ఆయన దౌత్య నీతి సాగుతోంది. బహుళ ధ్రువ ప్రపంచంలో ఎటువైపూ వాలిపోకుండా, సమాన దూరం పాటిస్తూ, సమతుల్యతతో అన్ని దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునే విషయంలో అమెరికా సహా పాశ్చాత్య దేశాల ఒత్తిళ్ల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. భారత దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారు. మోదీ 2024 జూలై 9-10 తేదీల్లో ఆస్ట్రియాలో పర్యటించారు. ఓ భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం 41 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. అదేవిధంగా 45 సంవత్సరాల తర్వాత పోలండ్‌లో పర్యటించిన భారత పీఎంగా మోదీ నిలిచారు. మోదీ రష్యాలో జూలై 8-9 తేదీల్లో పర్యటించారు. యుద్ధానికి పరిష్కారం యుద్ధ క్షేత్రంలో దొరకదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు కుండబద్ధలుకొట్టి చెప్పారు. శాంతికే ప్రాముఖ్యం ఇస్తున్నామని తెలిపారు. భారత్‌-రష్యా మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసినందుకు మోదీకి పుతిన్ ఆ దేశపు అత్యున్నత స్థాయి పౌర పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్‌ సెయింట్ ఆండ్రూస్ ది అపోసల్‌'ను ప్రదానం చేశారు. భారత్‌-ఉక్రెయిన్ మధ్య దౌత్య సంబంధాలు 1992లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఆ దేశంలో పర్యటించిన తొలి భారత దేశ ప్రధానిగా మోదీ నిలిచారు. ఆయన ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రకటించారు. చర్చలు, దౌత్య మార్గాల్లో యుద్ధాన్ని పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. మోదీ రష్యా పర్యటనను అమెరికా, కొన్ని పాశ్చాత్య దేశాలు విమర్శించాయి. భారత్‌, పోలండ్ దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాల సందర్భంగా మోదీ ఆగస్టు 21-22 తేదీల్లో ఆ దేశంలో పర్యటించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టపరచేందుకు ఇరు దేశాలు నిర్ణయించాయి. మోదీ సెప్టెంబరు 4-5 తేదీల్లో సింగపూర్‌లో పర్యటించారు.సెమీకండక్టర్‌, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రధాన కంపెనీ ఏఈఎంను ఇరు దేశాల ప్రధాన మంత్రులు సందర్శించారు. సింగపూర్‌లో ప్రధాన కంపెనీల సీఈఓలతో కూడా మోదీ సమావేశమయ్యారు. బ్రూనై దారుస్సలాంలో పర్యటించిన తొలి భారత పీఎంగా మోదీ నిలిచారు. ఆయన సెప్టెంబరు 3-4 తేదీల్లో తొలి ద్వైపాక్షిక పర్యటన జరిపారు. 2024 ఫిబ్రవరిలో మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు.ఆ దేశంతో పలు ఒప్పందాలు జరిగాయి. మన పొరుగు దేశం భూటాన్‌లో మార్చి 21-22 తేదీల్లో పర్యటించారు. డిసెంబరు 21-22 తేదీల్లో కువైట్‌లో పర్యటించారు. ఇండియన్ పీఎం ఆ దేశంలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే మొదటిసారి. నైజీరియాలో నవంబరు 17న పర్యటించిన మోదీని ఆ దేశపు అత్యున్నత స్థాయి పౌర పురస్కారంతో సత్కరించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారు. మోదీ నవంబరు 18న బ్రెజిల్‌లో జీ20 సదస్సులో పాల్గొన్నారు. అక్కడి నుంచి దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న గుయానాకు వెళ్లారు. చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్న ఈ చిన్న దేశం మన దేశానికి ఇంధన భద్రత విషయంలో చాలా ముఖ్యమైనది. మోదీ సెప్టెంబరు 21-23 తేదీల్లో అమెరికాలో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో జరిగిన క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రసంగించారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. పీఎం డిసెంబరు 21-22 తేదీల్లో కువైట్‌లో పర్యటించారు. 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa