తమ వద్ద తీసుకున్న బాకీ తీర్చలేదని.. అతడి ఏడేళ్ల కుమార్తెను వడ్డీ వ్యాపారులు కిడ్నాప్ చేసి.. అమ్మేశారు. ఆ పాపను అమ్మగా వచ్చిన సొమ్మును తమ బాకీ కింద జమకట్టుకున్నారు. అత్యంత దారుణమైన ఈ సంఘటన ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో చోటుచేసుకుంది. బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదుపై తక్షణమే పోలీసుల స్పందించి... రంగంలోకి దిగారు. ఆ వడ్డీ వ్యాపారులు, చిన్నారిని కొనుగోలుచేసిన రాజస్థానీ వ్యక్తిని అరెస్టు చేశారు. వారి చెర నుంచి ఆ బాలికను విడిపించారు. బాధితులు, పోలీసులు కథనం ప్రకారం.. సబర్కాంత జిల్లా హిమ్మత్నగర సిటీ డివిజన్ ఎ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వడ్డీ వ్యాపారి అర్జున్నాథ్ వద్ద.. రోజు కూలీ అయిన బాధితుడు రూ.60 వేలు అప్పుగా తీసుకున్నాడు.
అధిక వడ్డీ వసూలు చేస్తోన్న అర్జున్ నాథ్.. క్రమం తప్పకుండా బాధితుడు వాయిదాలు చెల్లిస్తున్నప్పటికీ వేధింపులకు గురిచేశాడు. అతడు తీసుకున్నది రూ.60 వేలు అయితే.. వడ్డీతో కలిపి రూ.3 లక్షలకు పెరిగిందని, మొత్తం తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఆరావళి జిల్లా మోదసాకు చెందిన షరీఫా నాథ్, మహిసాగర్ జిల్లా దేవగం గ్రామానికి చెందిన లఖ్పతి నాథ్ అనే మరో ఇద్దరు వడ్డీ వ్యాపారులతో కలిసి ఇటీవల బాధితుడిపై దాడిచేసి.. తీవ్రంగా కొట్టి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నాడు. అనంతరం అతడి ఏడేళ్ల కుమార్తెను అపహరించి.. రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తికి రూ.3 లక్షలకు అమ్మేశాడు.
తొలుత బాలిక తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. అనంతర అజ్మీర్ సమీపంలో ఉన్న ఓ గ్రామస్థుడికి పాపను అమ్మేసినట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై వెంటనే స్పందించి వడ్డీ వ్యాపారులు ముగ్గురినీ అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా రాజస్థాన్ వెళ్లి బాలికను కాపాడి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ముగ్గురు నిందితులను శనివారం కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. వీరికి కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది. డిసెంబరు 19న ఎఫ్ఐఆర్ నమోదైన గంటల వ్యవధిలోనే వారిని అరెస్టు చేసి బాలికను కాపాడినట్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది.
అయితే, ఇటీవల ఓ మహిళ.. తన భర్త అప్పులను తీర్చడానికి కుమార్తెను అమ్మేసిన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నెల్లాలు వయసుప్న బిడ్డను ఆమె అమ్మేసి..అనారోగ్యమైతే బంధువుతో ఆసుపత్రికి పంపించానని భర్తకు అబద్దం చెప్పింది. చివరకు భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa