ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్వెస్టర్లను ముంచిన టీసీఎస్, రిలయన్స్ స్టాక్స్.. 5 రోజుల్లో రూ. 2 లక్షల కోట్లకుపైగా లాస్

business |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 09:40 PM

 విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (TCS), టాటా గ్రూప్ కంపెనీ టాటా కన్సల్టె్న్సీ సర్వీసెస్ తొలి రెండు స్థానాల్లో ఉంటాయి. అయితే ఈ రెండు కంపెనీల మార్కెట్ విలువ గత వారం భారీగా పడిపోయింది. స్టాక్స్ పెద్ద మొత్తంలో పతనం కాగా.. ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని చెప్పొచ్చు. ఇక టాప్- 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ చివరి వారంలో రికార్డు స్థాయిలో రూ. 4.95 లక్షల కోట్ల మేర పడిపోయింది. అంటే ఈ 10 స్టాక్స్ నుంచి ఇన్వెస్టర్లు ఇంతలా నష్టపోయారన్నమాట. అంతకుముందు స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పెరగ్గా.. ఇప్పుడు తిరోగమనం దిశగా పరుగులు పెడుతున్న నేపథ్యంలో సూచీలు పడిపోతున్నాయి. దీంతో ఆయా కంపెనీల మార్కెట్ విలువ తగ్గుతోంది.


ఇలా ఉండగా టాప్- 10 కంపెనీల్లో రిలయన్స్, టీసీఎస్ ఎక్కువగా నష్టపోయాయి. ఇన్వెస్టర్లకు నష్టాల్ని మిగిల్చాయి. BSE బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ గత వారంలో 4091.53 పాయింట్లు పతనమైంది. ఇది దాదాపు 4.98 శాతం కావడం గమనార్హం. నిఫ్టీ 4.77 శాతం తగ్గింది. 2022 జూన్ తర్వాత.. ఒక వారంలో ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి దేశీయ సూచీలు పడుతూనే ఉన్నాయి.


టీసీఎస్ మార్కెట్ విలువ వారం వ్యవధిలో ఏకంగా రూ. 1.10 లక్షల కోట్లు తగ్గి శుక్రవారం సెషన్ ముగిసే నాటికి రూ. 15.08 లక్షల కోట్లకు దిగొచ్చింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 91 వేల కోట్లకుపైగా తగ్గి రూ. 16.32 లక్షల కోట్ల మార్కుకు చేరింది. అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 76 వేల కోట్లకుపైగా తగ్గడంతో ఇప్పుడు అది రూ. 13.54 లక్షల కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్ ఎం- క్యాప్ రూ. 59 వేల కోట్ల పతనంతో రూ. 8.98 లక్షల కోట్లకు దిగొచ్చింది.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ వారంలో రూ. 43 వేల కోట్ల పతనంతో రూ. 7.25 లక్షల కోట్లకు దిగొచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ విలువ రూ. 41 వేల కోట్లు పడిపోయి రూ. 9.07 లక్షల కోట్ల మార్కు వద్ద ఉంది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ. 32 వేల కోట్ల పతనంతో రూ. 7.98 లక్షల కోట్లకు దిగొచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఎం- క్యాప్ రూ. 20 వేల కోట్లు పడిపోయి ప్రస్తుతం రూ. 5.69 లక్షల కోట్లుగా ఉంది.


హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ విలువ రూ. 12 వేల కోట్లు పతనంతో రూ. 5.48 లక్షల కోట్లకు చేరింది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6 వేల కోట్లకుపైగా పతనంతో ప్రస్తుతం రూ. 5.81 లక్షల కోట్లుగా ఉంది. ఇక ఎం- క్యాప్ పరంగా భారత టాప్ -10 కంపెనీలు వరుసగా రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఐటీసీ, ఎల్ఐసీ, హిందుస్థాన్ యూనిలివర్ ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa