గతంలో చైనాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో మనందరికీ తెలిసిందే. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ చైనా దేశంలోనే మరో కొత్త వైరస్ బయటికి వచ్చింది. హ్యూమన్ మెటానిమోవైరస్ కేసులు చైనాలో ఇటీవలి కాలంలో భారీగా నమోదవుతుండగా.. అవి క్రమంగా ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జపాన్, హాంకాంగ్, మలేషియా, భారత్ వరకు ఈ హెచ్ఎంపీవీ కేసులు వ్యాప్తి చెందాయి. మన దేశంలో సోమవారం రోజే తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు గుర్తించగా.. ఆ తర్వాత మరో 3 కేసులు బయటికి వచ్చాయి. దీంతో ఇప్పటికే అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
అయితే భారత్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న వేళ.. సోషల్ మీడియాలో నెటిజన్ల హంగామా మొదలైంది. దీంతో లాక్డౌన్ అంటూ హ్యాష్ ట్యాగ్లతో వేలాది పోస్ట్లు చేస్తున్నారు. దీంతో #lockdown అనేది ఇప్పుడు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. భారత్లో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ విధించాలని ట్విట్టర్లో పోస్టులు, మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
గతంలో కొవిడ్ వైరస్ వెలుగుచూసినపుడు తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. మరికొందరు నెటిజన్లు.. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో విధించిన ఆంక్షలు విధించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇక మరికొందరు నెటిజన్లు.. ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా అందరూ బాధ్యతగా నడుచుకోవాలని సూచిస్తూ పోస్టులు పెడుతున్నారు. గతంలో 2020లో కరోనా వచ్చిన సమయంలో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాన్ని గుర్తు చేసుకుని.. దేశ ప్రజలు అంతా సరైన జాగ్రత్తలు పాటిస్తూ.. వైరస్ వ్యాప్తిని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు వీలైనంత ప్రయత్నం చేయాలని పేర్కొంటున్నారు. ఇక మరికొంతమంది నెటిజన్లు ఈ వైరస్ వ్యాప్తిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదంతా ఫార్మా మాఫియా చేస్తున్న హడావిడి అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
అయితే దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి భయాలు నెలకొంటున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. వైరస్ వ్యాప్తికి సంబంధించి అన్ని కట్టడి చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇది సాధారణ ఫ్లూ, శ్వాసకోస సంబంధిత వ్యాధుల లాంటిదేనని.. దాని వల్ల ప్రమాదం ఏమీ ఉండదని పేర్కొంది. ప్రజల్లో అనవసర భయాలను రెచ్చగొట్టొద్దని హెచ్చరికలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa