కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో దేశీయ ఐటీ కంపెనీలు తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్నాయి. దీంతో వ్యయ నియంత్రణ కోసం భారీగా ఉద్యోగులను తొలగించాయి. అయితే, గత ఏడాది ప్రారంభం నుంచి పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. దీంతో మళ్లీ ఉద్యోగులను తీసుకోవడం ప్రారంభించాయి. దీంతో ఐటీ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ, ఈ కొత్త ఏడాది 2025లో మళ్లీ ఆందోళనలు నెలకొన్నాయని చెప్పవచ్చు. దేశీయ టెక్ దిగ్గజాలు అక్టోబర్- డిసెంబర్ కాలానికి సంబంధించిన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. జనవరి 9వ తేదీ గురువారం రోజున టాటా గ్రూప్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) క్యూ3 ఫలితాలను ప్రకటించింది. కంపెనీ లాభాలు పెరిగినా ఉద్యోగుల విషయంలో షాకింగ్ ప్రకటన చేసింది.
దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీగా కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఈ ఆర్థిక సంవత్సరం 2024- 25 మూడో త్రైమాసికం అంటే అక్టోబర్- డిసెంబర్ కాలంలో ఉద్యోగుల సంఖ్య ఏకంగా 5370 తగ్గింది. ఈ మేరకు క్యూ3 ఫలితాల సందర్భంగా వివరాలు వెల్లడించింది. అంతకు ముందు వరుసగా రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్న టీసీఎస్ ఇప్పుడు భారీగా తగ్గించుకోవడం గమనార్హం. దీంతో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 6,07,354కు తగ్గింది.
'ఈ త్రైమాసికంలో మొత్తం 25 వేల మంది అసోసియేట్స్ని ప్రమోట్ చేశాం. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రోమోషన్ల సంఖ్య 1,10,000లకు పైగా పెరిగింది. ఉద్యోగుల నైపుణ్యాల పెంపు కోసం మా ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటాం. అలాగే ప్లాన్ ప్రకారమే క్యాంపస్ నియామకాలు కొనసాగుతాయి. వచ్చే ఏడాదిలో క్యాంపస్ నియామకాల్లో అత్యధికంగా ఆన్బోర్డింగ్స్ ఉంటాయి.' అని ఈ సందర్భంగా కంపెనీ చీప్ హ్యూమ్ రీసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.
మరోవైపు.. కంపెనీలో డిసెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల వలసలు 13 శాతం పెరిగినట్లు టీసీఎస్ తెలిపింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 12.3 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2004లో మార్కెట్లలోకి లిస్టయిన తర్వాత ముంబై కేంద్రంగా సేవలందిస్తున్న ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరం 2023లో ఈ కంపెనీ మొత్తం 22,600 మంది ఉద్యోగులను పెంచుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2022లో 1.03 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకుంది. ఇక ఆ ఆర్థిక సంవత్సరం 2024-25 మూడో త్రైమాసికంలో అంచనాలను అందుకుని అదరగొట్టింది టీసీఎస్. క్యూ3లో రూ.12,380 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. మార్కెట్ల పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా మంచి ప్రాజెక్టులు అందుకున్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa