ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగిస్తోంది. ముఖ్యంగా పాత పన్ను విధానాన్ని టచ్ చేయకుండా.. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లను సరళీకృతం చేస్తూ వస్తోంది. దీంట్లో గత కొన్ని బడ్జెట్ సమయాల్లో ఊరించే ప్రకటనలు చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం సహా.. పన్ను శ్లాబుల్ని కూడా మార్చారు. ఇది అల్ప, మధ్య ఆదాయ వర్గాల వారికి ఎంతో ఉపకరించింది. అయితే ఈ సమయంలో పాత పన్ను విధానం రద్దు చేయొచ్చన్న వాదనలు కూడా వచ్చాయి. ఇప్పుడు.. ఫిబ్రవరి 1న బడ్జెట్ నేపథ్యంలో ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి.
ఇప్పుడు డైరెక్ట్ టాక్స్ కోడ్ (ప్రత్యక్ష పన్ను చట్టం) - 2025 ను బడ్జెట్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాల్ని సరళీకృతం చేసే దిశగా తీసుకొస్తున్న చట్టం. ఇది అమల్లోకి వస్తే గనుక అప్పుడు ఆదాయపు పన్ను చట్టం- 1961 ను ఇది రీప్లేస్ చేస్తుందని చెప్పొచ్చు.
ఈ ప్రత్యక్ష పన్ను చట్టం అమలైతే.. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టాన్ని పూర్తిగా పునరుద్ధరిస్తుందని దీంతో చట్టపరంగా ఇప్పుడు ఉన్న ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయని.. అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రజలపై, ప్రభుత్వంపై, పరిశ్రమ వర్గాలపై భారం తగ్గుతుందని చర్చించుకుంటున్నారు.
ఆదాయపు పన్ను చట్టం- 1961 సమీక్ష గురించి గత బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. ఈ క్రమంలో అప్పటినుంచే దీనిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పనిచేస్తోంది. పన్ను చట్టం సమీక్షను 6 నెలల్లోనే పూర్తి చేస్తామని ఆగస్టులోనే చెప్పారు సీబీడీటీ ఛైర్మన్ రవి అగర్వాల్. ఈ క్రమంలో బడ్జెట్ నాటికి ఆ సమయం పూర్తయి.. అప్పుడే ఆర్థిక మంత్రి కొత్త పన్ను చట్టం లేదా కొత్త పన్ను కోడ్పై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పన్ను చట్టాన్ని మరింత సరళంగా మార్చేందుకు సమీక్ష చేయాలని.. పన్ను చట్టం గురించి అందరికీ అర్థమయ్యేలా సరళంగా మార్చడం సహా వివాదాలు లేకుండా తీర్చిదిద్దాలని అన్నారు.
కొత్త పన్ను చట్టంలో నిబంధనలతో ముఖ్యంగా మధ్య తరగతి వర్గానికి ఊరట దక్కొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే పన్ను విధానాల్ని క్రమబద్ధీకరిస్తారని.. శ్లాబుల్ని తగ్గిస్తారని.. సంక్లిష్టంగా ఉండకుండా సులభతరం అవుతుందని భావిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా కొత్త టాక్స్ కోడ్ అమల్లోకి వస్తే రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉండే మధ్యతరగతి వర్గానికి భారీ ప్రయోజనం దక్కుతుందని.. పన్ను ఊరట కలుగుతుందని అంచనా వేస్తున్నారు. మరి బడ్జెట్లో దీనిపై ప్రకటన ఉంటుందా.. ఉంటే రూ. 15 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఊరట కలుగుతుందా చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa