సాధారణంగా బడ్జెట్ అనగానే.. ఆయా రంగాలకు కేటాయింపుల సంగతి పక్కనపెడితే ప్రధానంగా అందరి దృష్టి ఇన్కంటాక్స్ సంబంధించిన నిర్ణయాలపైనే ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు.. టాక్స్ రేట్లకు సంబంధించి ఏమైనా ఊరించే ప్రకటన వస్తుందా.. పన్ను తగ్గించేందుకు కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనే చూస్తుంటారు. ముఖ్యంగా గత రెండు బడ్జెట్ సమయాల్లో కొత్త ఆదాయ పన్ను విధానం కింద కీలక ప్రకటనలు చేయడం విశేషం. పాత పన్ను విధానాన్ని టచ్ చేయకుండా.. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలకు పెంచడం, పన్ను శ్లాబుల్ని సరళీకరించడం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 1న లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. చాలా మంది తమ డిమాండ్లు వినిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ముంబై బేస్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్.. వేతన జీవులకు ఆదాయపు పన్నుకు సంబంధించి 5 డిమాండ్లను ముందుంచారు. అంటే వీటిపై ప్రకటనలు ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అవేంటో చూద్దాం. పన్ను శ్లాబుల్లో మార్పులు- కొత్త పన్ను విధానాన్ని టాక్స్పేయర్లకు మరింత దగ్గర చేసేందుకు.. ఆకర్షించేందుకు.. కీలక ప్రకటనలు చేస్తూ వస్తున్న కేంద్రం ఈసారి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని బల్వంత్ అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని వార్షికంగా రూ. 20 లక్షల వరకు సంపాదించే వారికి టాక్స్ రేటు 20 శాతంగా ఉండాలని కోరుతున్నారు. ప్రస్తుతం రూ. 15-30 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి టాక్స్ రేటు 30 శాతంగా ఉంది.
సీనియర్ సిటిజెన్లకు ప్రత్యేక పన్ను శ్లాబులు- టాక్స్ పేయర్లు అందరికీ.. పన్ను శ్లాబులు ఒకేరకంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీనియర్ సిటిజెన్లు అంటే 60 ఏళ్లు పైబడిన వారికి కొత్త పన్ను విధానం కింద ప్రత్యేక పన్ను చట్టం తీసుకురావాలని.. దీని కింద తక్కువ పన్ను రేట్లు విధించడం లేదా ఎక్కువ మినహాయింపులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు- ఎలాంటి ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ కింద కొత్త పన్ను విధానంలో రూ. 75 వేలు టాక్స్ తగ్గించుకోవచ్చు. అయితే దీనిని రూ. లక్షకు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది.
బంగారంపై దిగుమతి సుంకం- బంగారం దిగుమతుల్ని తగ్గించుకోవడం సహా ద్రవ్య లోటును అధిగమించేందుకు కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాన్ని బడ్జెట్లో పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇది ధరల పెరుగుదలకు దారి తీస్తుందని.. ఇంకా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి విభేదాలకు కారణం కావొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది.
సెక్షన్ 80c డిడక్షన్ పెంపు- పాత పన్ను విధానం కింద కొన్నింటిలో పెట్టుబడులపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను తగ్గించుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా.. దీనిని ఇప్పుడు రూ. 3.50 లక్షలకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa