రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ కడ్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజ్యసభ ఛైర్మన్ ను కలవడానికి ముందే విజయసాయి నివాసానికి వెళ్లి అయనను కలిశారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. ఈ సందర్భంగా మీడియాతో గురుమూర్తి మాట్లాడుతూ... రాజీనామా చేయవద్దని విజయసాయిని తాను కోరానని చెప్పారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో విజయసాయి చెప్పడం లేదని తెలిపారు. ఏవైనా చిన్నిచిన్ని లోపాలు, సమస్యలు ఉంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని చెప్పానని వెల్లడించారు. 2029 ఎన్నికల్లో అందరం కలిసి పోటీ చేసేందుకు సమాయత్తమవుదామని చెప్పానని తెలిపారు. పార్టీలోకి తిరిగి రావాలని, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పారు.