ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ బలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 06:46 PM

గుంటూరు జిల్లా తెనాలిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. కుటుంబ నియంత్రణ కోసం వచ్చిన ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. అది వికటించడంతో గాజుల పావని(32) అనే మహిళ మృతి చెందింది. ఈ ఆపరేషన్ చేయడంలో వైద్యుల నిర్గక్షం స్పష్టంగా కనిపిస్తోంది. ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు చిన్న ప్రేగుకు, యూరినరీ బ్లాడర్‌కు గాయం చేశారు. దీంతో ఆమె శరీరం విషతుల్యమై షాక్‌లోకి వెళ్లింది. అప్రమత్తమైన వైద్యులు హుటాహుటిన గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శవాగారానికి తరలించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పావని చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు తిరుపతిలో ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళం సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లా, డోన్ పట్టణానికి చెందిన శివప్రసాద్ (19)గా పోలీసులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం కళాశాలకు వెళ్లకుండా విద్యార్థి ఉన్న రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రూయా మార్చురీకి తరలించారు. విద్యార్థి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి.. కేసు నమోదు చేసిన తిరుచానూరు పోలీసులు ఆత్మహత్య సంబంధించిన కారణాలపై విచారిస్తున్నారు.కాగా ఏపీలోని కాకినాడలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ మహిళ సెల్‌ఫోన్ మింగేసింది. డాక్టర్లు ఆమె ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. వివరాల్లోకి వెళ్లితే... కాకినాడ జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి(35) గత 15 ఏళ్ల నుంచి మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమె కుటుంబసభ్యులు శనివారం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్లు ఆమెకు చికిత్స చేస్తున్నారు. అయితే ఆమె వద్ద ఎవరూలేని సమయంలో కీ ప్యాడ్ మొబైల్ ఫోన్‌ను మింగేసింది. బయటకు వెళ్లి వచ్చిన కుటుంబ సభ్యులు ఫోన్ కోసం వెతగ్గా.. తాను మింగినట్లు చెప్పింది. దోంతో వారు వెంటనే డాక్టర్లకు సమాచారం ఇచ్చారు. పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసి మొబైల్‌ను తొలగించారు. అయితే అప్పటికే అన్నవాహికకు సంబంధించిన ఈసోపేగస్‌ పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో అక్కడి వైద్యుల సూచన మేరకు కుటుంబీకులు శనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా.. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa