పొట్టి ఫార్మాట్లో బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకెళ్తున్న టీమిండియా స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. ఎదురొచ్చిన ప్రతి జట్టును తొక్కిపడేస్తూ వెళ్తున్న భారత్ను ఇంగ్లండ్ అడ్డుకుంది.ఆ టీమ్తో జరిగిన మూడో టీ20లో సూర్య సేన ఓటమిపాలైంది. 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. వరుసగా రెండు విజయాలతో సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి వచ్చిన మెన్ ఇన్ బ్లూ.. రాజ్కోట్లోనే బట్లర్ సేన కథ ముగించి సిరీస్ను కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఓటమితో ఇప్పుడు నాలుగో మ్యాచ్ వరకు ఆగాల్సిన పరిస్థితి. రాజ్కోట్ ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి వల్లే ఓడామన్నాడు.మ్యాచ్కు ముందు మంచు ప్రభావం ఉంటుందని భావించానని.. కానీ అలా జరగలేదన్నాడు సూర్యకుమార్. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నంత వరకు మ్యాచ్ భారత్దేనని అనుకున్నానని.. కానీ ఓటమి తప్పలేదన్నాడు. తిలక్ వర్మ కూడా దూకుడుగా ఆడాడని మెచ్చుకున్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మ్యాచ్ను మలుపు తిప్పాడని.. అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని స్కై ప్రశంసించాడు. రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నాడు. అతడు టాప్ క్వాలిటీ స్పిన్నర్ అని.. స్ట్రైక్ రొటేషన్ చేయకుండా తమను అడ్డుకున్నాడని తెలిపాడు సూర్య. తమ ఓటమికి అతడే కారణమన్నాడు.
'ఆదిల్ సూపర్ స్పిన్నర్. అతడి బౌలింగ్ అద్భుతం. పరుగులు చేయకుండా, కనీసం స్ట్రైక్ రొటేట్ చేయకుండా మమ్మల్ని నిలువరించాడు. మా నుంచి మ్యాచ్ను దూరం చేశాడు. పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందనే ఉద్దేశంతోనే టీమ్లో మేమూ ఎక్కువ మంది స్పిన్నర్లకు చాన్స్ ఇచ్చాం. బౌలింగ్ పరంగా మాకు సమస్యలు లేవు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అద్భుతం. అతడి కష్టానికి తగ్గ ఫలితం వస్తోంది. అయితే మేం బ్యాటింగ్లో మరింతగా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఓటమిని మర్చిపోను. దీని నుంచి గుణపాఠాలు నేర్చుకొని మరింత స్ట్రాంగ్గా కమ్బ్యాక్ ఇస్తాం' అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa