ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలకలం సృష్టిస్తున్న దాడి దోపిడీ దొంగతనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:23 PM

నంద్యాల జిల్లాలో దాడి దోపిడీ దొంగల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజలపై దాడులు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. మెున్న దంపతులపై దాడి ఘటన మరవకముందే మరో దాడికి దుండగులు పాల్పడ్డారు. నంద్యాల శివారు రైతు నగర్ వద్ద దొంగలు రెచ్చిపోయారు. వాహనదారులపై యథేచ్ఛగా దాడులకు తెగించారు. రైతు నగర్ వద్ద లిఫ్ట్ నెపంతో కారు ఆపిన దుండగులు ఒక్కసారిగా డ్రైవర్ ప్రభాకర్‌పై దాడి చేశారు. కత్తులు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకుని ఉడాయించారు.దాడిలో డ్రైవర్ తల, ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలు అయ్యాయి.


రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు దాడి జరగడాన్ని గమనించి బాధితుడు ప్రభాకర్‌ను హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. కొంతమంది ముసుగులు ధరించిన దుండగులు తనపై దాడి చేసినట్లు డ్రైవర్ తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా, వారం రోజుల క్రితం కూడా మరో దారి దోపిడీ ఘటన జరిగింది. పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన దామరేకుల పెద్దన్న, జయమ్మ దంపతులపై దుండగులు కత్తులతో రెచ్చిపోయారు. పెదన్న, జయమ్మల కుమార్తె గర్భిణీ కావడంతో కర్నూలు- నంద్యాల రహదారిలో ఉన్న శాంతిరామ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డెలివరీ నిమిత్తం అక్కడే ఉండాలని వైద్యులు తెలిపారు. అయితే అదే రోజు రాత్రి బహిర్భూమికి వెళ్లేందుకు ఆ దంపతులు జాతీయ రహదారి పక్కనే ఉన్న పొల్లాల్లోకి వెళ్లారు.అక్కడే ఉన్న దుండగులు పెద్దన్నపై కత్తులతో దాడి చేశారు. తల, కాళ్లు, ఇతర భాగాలపై పొడిచారు. జయమ్మపైనా దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు దోచుకెళ్లారు. అనంతరం కాసేపటికి తేరుకున్న జయమ్మ రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారం గడవక ముందే మరో దాడి జరగడంతో జిల్లా వాసుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa