ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర బడ్జెట్ 2025పై అందరి ఆసక్తి ,,,ఆంధ్రప్రదేశ్ కు ఆ లక్ష కోట్లు దక్కేనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 08:26 PM

ఫిబ్రవరి అనగానే మధ్యతరగతి వేతన జీవులు అందరికీ గుర్తొ్చ్చేది కేంద్ర బడ్జెట్. ఆ మాటకొస్తే వేతన జీవులకే కాదు.. దేశంలోని ప్రతి ఒక్కరిపైనా బడ్జెట్ ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జె్ట్ 2025పై ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈసారి కేంద్ర బడ్జెట్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద భారీగా ఆశలు పెట్టుకుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా సహకారం అవసరం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈసారి నాయుడి గారి మాట నెగ్గుతుందా? కేంద్ర బడ్జెట్ 2025‌లో ఏపీకి ప్రాధాన్యం ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.


2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఫేటు మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరపతి బాగా పెరిగింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ బీజేపీకి రాని నేపథ్యంలో.. ఆ పార్టీ ఇతర ఎన్డీఏ పక్షాలపై ఆధారపడుతోంది. బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఆర్జేడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు కొలువు దీరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ 2025లో ఏపీకి ప్రాధాన్యం ఎంతమేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.


2024 జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి దక్కిన ప్రాధాన్యం.. ఇటీవల ఏపీలో పర్యటించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాటల నేపథ్యంలో ఆసక్తి మరింత పెరిగింది. విశాఖలో పర్యటించిన ప్రధానమంత్రి మోదీ.. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటో తెలియజేశారు. అలాగే 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి.. ఏపీ అభివృద్ధిపై తమ నిబద్ధతను తెలియజేశారు.


  2024 బడ్జెట్ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం రూ.15 వేల కోట్లు కేటాయించింది. ప్రపంచబ్యాంకు ద్వారా ఈ రుణాన్ని అందిస్తామని తెలిపింది. అలాగే వచ్చే రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే ఏపీ జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారమందిస్తామని చెప్పారు. ఆ బడ్జెట్‌లో బిహార్, ఏపీ రాష్ట్రాలకు కేంద్రం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2025 కేంద్ర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అదే ప్రాధాన్యం కొనసాగిస్తుందా లేదా చూడాలి.


ఇక 2047 నాటికి ఏపీని 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని చంద్రబాబు నిర్దేశించుకున్నారు. ఈ ఉద్దేశంతోనే స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని ఏపీ చేరుకోవాలంటే కేంద్రం నుంచి నిరంతరం మద్దతు అవసరం. 2025 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో పర్యటించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో భేటీ అయ్యారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు వారికి అందజేశారు. ఈ విజన్ సాకారం చేసుకునే దిశగా ఏపీకి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.


అలాగే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి ఏడు వేల కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.50000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 12 వేల కోట్లు, అప్పులు తీర్చేందుకు ఇలా లక్ష కోట్లు వరకూ ఇవ్వాలని జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా చంద్రబాబు ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. మరి నాయుడు గారి మాట నెగ్గుతుందా.. బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం దక్కుతుందా.. బడ్జెట్ 2024 ప్రకటన సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేసినట్లు కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రూ.లక్ష కోట్లు వాటా దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa