ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊరేగింపుతో ఉత్సాహంగా వెళ్లిన వరుడు, వధువు గ్రామానికి వెళ్లి షాక్

national |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 11:13 PM

పెళ్లి అనేది చాలా మందికి ఒక కల. ఎన్నో ఏళ్లు వేచి చూసి.. జీవితాంతం కలిసి ఉండే వ్యక్తితో ఒక్కటవ్వడం అనేది చెప్పలేని అనుభూతి. అయితే అలాంటి అనుభూతి అందరికీ దక్కదు. పెళ్లి కాక ఎంతో మంది బాధపడుతుండగా.. పెళ్లి ఫిక్స్ అయినా అవుతుందో లేదో అని దిగులు చెందే వారు చాలా మంది ఉంటారు. మెడలో తాళి పడేవరకు.. పెళ్లి జరిగినట్లు కాదు అనే సామెత ఉన్నట్లు.. చివరి నిమిషంలో పెటాకులు అవుతున్న పెళ్లిళ్లు ఈ మధ్య కాలంలో అనేకం కనిపిస్తున్నాయి. అలాంటిదే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో ఒకటి జరిగింది. ఓ వ్యక్తికి మధ్యవర్తి ద్వారా పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది. ఫోన్‌లోనే ఫోటోలు పంపించుకుని.. మాట్లాడుకుని పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. తీరా పెళ్లి రోజు ఆ వధువు గ్రామానికి వెళ్లగా.. అక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది.


హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఈనెల 28వ తేదీన జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నారి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల పెళ్లి కుదిరింది. తన ఇంటి పక్కనే ఉండే రాజీవ్, మను దంపతులు.. తమకు తెలిసిన వారి కుటుంబానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయం చేశారు. అందుకు ప్రతిఫలంగా వారికి రూ.50 వేలు కూడా ఆ వరుడు చెల్లించుకున్నాడు. అయితే పెళ్లి కొడుకు నేరుగా పెళ్లి కుమార్తెను చూడకుండా.. వాట్సాప్‌లో ఫోటో చూసి, ఆ వధువుతో మాట్లాడి ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఫోన్‌లోనే అన్నీ మాట్లాడేసుకున్న ఆ రెండు కుటుంబాలు ఈనెల 28వ తేదీన పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు.


ఈ క్రమంలోనే వరుడు.. తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి కుమార్తె ఊరు అయిన సింగా గ్రామానికి.. ఈనెల 28వ తేదీన చేరుకున్నాడు. అయితే.. ఆ గ్రామంలో ఎక్కడా పెళ్లికి ఏర్పాట్లు లేకపోవడం చూసి వారంతా షాక్‌ అయ్యారు. ఏ ఇంటి వద్ద కూడా పెళ్లి సందడి కనిపించకపోవడంతో వధువు ఫోటోను సింగ్రా గ్రామంలోని వారికి చూపించి వారి ఇల్లు ఎక్కడో అడిగాడు. అయితే ఆ ఫోటోలో ఉన్న యువతి ఎవరో తమకు తెలియదని.. అలాంటి అమ్మాయే తమ గ్రామంలో లేదని గ్రామస్తులు చెప్పడంతో వరుడు, అతడి కుటుంబం అవాక్కయింది.


అయితే పెళ్లి కుమార్తెను తీసుకొస్తానంటూ మధ్యవర్తిగా వ్యవహించిన మను అనే మహిళ కారులో అక్కడి నుంచి పరారైంది. తర్వాత విషయం అర్థం అయిన వరుడు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా అక్కడికి చేరుకున్నారు. అమ్మాయిని నేరుగా చూపించకుండా.. వరుడి ఇంటి పొరుగున ఉండే రాజీవ్‌, మను దంపతులు తమ వద్ద డబ్బులు తీసుకుని.. మోసం చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రాజీవ్‌కు ఫోన్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందని ప్రశ్నించారు.


అయితే వధువు ఏదో విషం తాగిందని.. అందుకే ఆమెను పంజాబ్‌లోని నవాన్‌షహర్ హాస్పిటల్‌కు తరలించినట్లు చెప్పాడు. దీంతో వరుడి కుటుంబానికి అనుమానం వచ్చింది. మను కోసం వెతికి ఆమెను పట్టుకుని ఆ గ్రామానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. దీంతో మోసపోయామని గ్రహించి.. వరుడు, అతని కుటుంబం తిరిగి తమ గ్రామానికి చేరుకుంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని లేదా పెళ్లికి మధ్యవర్తులుగా ఉన్నవారిపై ఉనా సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని వరుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa