ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లి పలు సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకుపోయిన వ్యోమగామి సునీతా విలియమ్స్ షాకింగ్ కామెంట్లు చేశారు. గత 7 నెలలుగా తాను అక్కడే ఉండడం వల్ల నడవడం కూడా మర్చిపోయాయని చెప్పారు. ప్రస్తుతం తాను ఎలా నడిచేదాన్ని గుర్తు తెచ్చుకుంటున్నట్లు వివరించారు. అలాగే జీరో గ్రావిటీ వద్ద పడుకొని విశ్రాంతి కూడా తీసుకోలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
2024 జూన్ 6వ తేదీన.. ఎనిమిది రోజుల మిషన్లో భాగంగా సునీతా విలియమ్స్, బుచ్విల్ మోర్లు రోదసిలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వీరు జూన్ 14వ తేదీనే తిరిగి రావాల్సి ఉంది. కానీ వారు వెళ్లిన వ్యోమనౌకలో హీలియం లీకేజీ కాగా.. పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయితే వాటిని పరిక్షరించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావడం లేదు. ఈక్రమంలోనే వారు గత ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.
గత ఏడు నెలలుగా అక్కడే ఉంటున్న సునీతా విలియమ్స్ తాజాగా అంతరిక్షం నుంచే విద్యార్థులతో మాట్లాడారు. ఈక్రమంలోనే ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను చాలా కాలంగా అంతరిక్షంలో ఉండడంతో నడవడం మర్చిపోయినట్లు వివరించారు. అసలు తాను గతంలో ఎలా నడిచేవారో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశారు. చాలా కాలంగా తాను నడవడం, కూర్చోవడం చేయడం లేదని చెప్పారు. కనీసం పడుకుని కూడా విశ్రాంతి తీసుకోలేకపోతున్నట్లు వివరించారు.
జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలుగా తేలియాడుతుండడంతో నేలపై నడిచిన అనుభవాన్ని పూర్తిగా మర్చిపోయినట్లు వెల్లడించారు. నెల రోజుల్లోనే తిరిగి వస్తామనే ఉద్దేశంతోనే తాము వెళ్లినప్పటికీ.. ఇన్ని నెలలుగా అక్కడే చిక్కుకుపోవడం షాకింగ్గా ఉందని పేర్కొన్నారు.
అయితే ఇలాగే మరింత ఎక్కువ కాలం వ్యోమగాములు అక్కడే ఉండాల్సి వస్తే మానసిక సమస్యలతో పాటు శారీరకంగానూ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జీరో గ్రావిటీ వద్ద ఉండడం వల్ల నడవడం, కూర్చోవడం వంటివేమీ చేయలేకపోవడంతో కండరాల క్షీణత బారిన పడతారని, ఎముకల పటిష్టత తగ్గి, పోషకాలలేమితో అనేక సమస్యలు ఎదుర్కుంటారని వివరిస్తున్నారు.
అయితే తాజాగా వీరిద్దరినీ తిరిగి భూమ్మీదకు తీసుకు రావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎలాన్ మస్క్ను కోరారు. ఈ విషయాన్ని నేరుగా మస్కే ఎక్స్ వేదికగా వెల్లడించారు. బైడెన్ ప్రభుత్వం వ్యోమగాములను భూమ్మీదకు తీసుకు వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది చాలా దారుణం అన్నారు. అయితే నాసా క్రూ-7 ద్వారా వారిని త్వరలోనే తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చూడాలి మరి వీరు ఎప్పుడు తిరిగి భూమ్మీదకు రాబోతున్నారనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa