144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఒక నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అచ్చం తిరుమల శ్రీవారి ఆలయాన్ని మైమరిపించేలా టీటీడీ ఆ ఆలయాన్ని రూపొందించింది. ఈ క్రమంలోనే ఆ నమూనా ఆలయంలో పనులు చూసుకునేందుకు ఇక్కడి నుంచి టీటీడీ సుమారు 200 మంది ఉద్యోగులను పంపించింది. ఈ నేపథ్యంలోనే మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన టీటీడీ ఆలయంలో విధులు నిర్వర్తించేందుకు వెళ్లిన ఒక ఉద్యోగి కనిపించకుండాపోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
దీవేటి సుబ్రహ్మణ్యం అనే టీటీడీ ఉద్యోగి బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయినట్లు ఆయనతోపాటు అక్కడే విధులు నిర్వర్తించే వారు టీటీడీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీవేటి సుబ్రహ్మణ్యం ఎక్కడికో వెళ్లాడని మొదట భావించినా.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో తోటి ఉద్యోగులు ఆందోళన చెందారు. వెంటనే ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని స్థానికంగా ఉన్న పోలీసులకు కూడా సమాచారం అందించి.. వారితో కూడా వెతికించే పనిలో పడ్డారు.
ఇక ఈ వ్యవహారంపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పందించారు. టీటీడీ ఉద్యోగి దీవేటి సుబ్రహ్మణ్యం అదృశ్యంపై పూర్తి సమాచారం అందించాలని అక్కడ ఉన్న ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో.. కుంభమేళా ప్రారంభం అయిన జనవరి 13వ తేదీ నుంచి సేవలు అందిస్తున్నారు. దీవేటి సుబ్రహ్మణ్యం ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని టీటీడీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa