మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి పగలు చేసేది పూజలు రాత్రిళ్ళు చేసేది దోపిడీలు అంటూ ధ్వజమెత్తారు. జగన్కు ఏమాత్రం తగ్గకుండా పెద్దిరెడ్డి అవినీతి పుంకాలు, పుంకాలుగా బయటికొస్తోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయాల్సిన పాపాలన్నీ చేసి ఇప్పుడు తనకేమీ తెలియదు అంటే పోతుందా అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి.. ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాతో వేలకోట్లు కొల్లగొట్టింది వాస్తవం కాదా అని నిలదీశారు. శివశక్తి డైయిరీ పేరుతో పాడి రైతుల కష్టార్జితాన్ని దోచుకుంది వాస్తవం కాదా అని మండిపడ్డారు. మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడిన ఘటనతో తనకేమీ సంబంధం లేదన్న పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. పుంగనూరు ఓటర్ లిస్ట్ కంటే పెద్దిరెడ్డి పాపాల లిస్టే ఎక్కువన్నారు. 75 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవడమే కాక దర్జాగా అడవిలోకి రోడ్డు వేసుకొని ప్యాలెస్ కట్టుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర ప్రభుత్వ భూమిలో 20 ఎకరాలు పెద్దిరెడ్డి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న మాట వాస్తవం కాదా అని అన్నారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టాలంటూ ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి ప్రజల ఉసురు పోసుకున్నారని విమర్శించారు. ఈ ఘటనలో ఎన్జీటీ పెద్దిరెడ్డికి 100 కోట్లు ఫైన్ వేసిన మాట వాస్తవం కాదా అని అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర్నుంచి పెద్దిరెడ్డి తన అవినీతి సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తం చేశారు అంటూ పంచుమర్తి విరుచుకుపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa