చట్టబద్ధమైన వివాహం బంధంలో పుట్టిన సంతానానికి భర్తే అసలైన తండ్రి అవుతాడని సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆ పిల్లలు వారికి చట్టబద్దమైన సంతానమని స్పష్టం చేసింది. తన కొడుక్కి నిజమైన తండ్రి ఎవరో తేల్చేందుకు డీఎన్ఏ పరీక్షకు అనుమతించాలని కోరుతూ కేరళకు చెందిన ఓ మహిళ చేసిన అభ్యర్థనను ఈ మేరకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేరళ మహిళ పిటిషన్పై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధత, పితృత్వం అనేవి వేర్వేరు భావనలు అని వ్యాఖ్యానించింది.
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లోని సెక్షన్ 112 ప్రకారం చట్టబద్ధత పితృత్వాన్ని నిర్ణయిస్తుందని ధర్మాసనం గుర్తుచేసింది. దీని ప్రకారం అధికారికంగా తండ్రి పేరులో మహిళ మాజీ భర్త పేరే ఉంటుందని తేల్చిచెప్పింది. అవసరమైతే తన కుమారుడికి డీఎన్ఏ పరీక్షకు అనుమతించి.. తండ్రి ఎవరో తేల్చాలన్న మహిళ వాదనలను తోసిపుచ్చింది. ఇటువంటి చర్యలకు అనుమతించడం గోప్యత, గౌరవానికి భంగం కలిగించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
‘బలవంతంగా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవడం వల్ల వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.. ముఖ్యంగా వారి గౌరవం, ప్రతిష్ఠలను దెబ్బతీస్తుంది..సామాజిక, వృత్తి జీవితాన్ని, అతడి మానసిక ఆరోగ్యాన్ని తిరిగి మార్చలేని విధంగా ప్రభావితవుతుంది. కాబట్టి ఆ వ్యక్తి గౌరవం, గోప్యతను కాపాడుకోవడానికి చర్యలు తీసుకునే హక్కు అతడికి ఉంది’ అని ధర్మాసనం తెలిపింది.
కేసు వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన సదరు మహిళకు 1991లో వివాహం జరిగింది. పెళ్లైన పదేళ్ల తర్వాత 2001లో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కొచ్చిన్ మున్సిపల్ కార్పొరేషన్ బర్త్ రిజిస్ట్రేషన్లో తండ్రి స్థానంలో ఆమె భర్త పేరునే నమోదు చేసింది. కానీ, వీరి మధ్య విభేదాల రావడంతో 2003 నుంచి వేర్వేరుగా ఉంటూ కొన్నాళ్ల తర్వాత విడాకుల కోసం కోర్టుకెక్కారు. ఈ దంపతులు ఉమ్మడి దరఖాస్తును దాఖలు చేశారు.చివరకు 2006లో కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.
విడాకుల తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను సంప్రదించిన సదరు మహిళ.. జనన రిజిస్టర్లో ‘తండ్రి’గా మరొ వ్యక్తి పేరు నమోదు చేయమని కోరింది. అతడే తన బిడ్డకు అసలైన తండ్రి అని చెప్పుకొచ్చింది. వివాహేతర బంధం ద్వారా ఆ బిడ్డను కన్నానని తెలిపింది. ఆమె కోరినట్టు ఎప్పుడుపడితే అప్పుడు తండ్రి పేరు మార్చడానికి సాధ్యం కుదరదని అధికారులు తిరస్కరించారు. ఒకవేళ మార్చాలంటే కోర్టు ఆదేశాలు ఉండాలని అన్నారు. దీంతో ఆమె 2007లో మునిసిఫ్ కోర్టులో పిటిషన్ వేయగా.. చుక్కెదురయ్యింది. ఈ తీర్పును 2011లో ఆమె కేరళ హైకోర్టులో సవాల్ చేయగా.. ఇదే తీర్పు వచ్చింది. చివరకు కేసు సుప్రీం కోర్టుకు చేరడంతో కీలక తీర్పు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa