పేద విద్యార్థులను స్కూలుకు తీసుకువచ్చి చదువుకునేలా చేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కనీసం భోజనం చేయలేని వారు.. స్కూళ్లకు వచ్చి తినడం కోసమైనా చదువుకునేందుకు వస్తారని ప్రభుత్వాలు తీసుకున్న ఒక గొప్ప పథకమే ఈ మధ్యాహ్న భోజన పథకం. అయితే ఇటీవల మహారాష్ట్రలో మరోసారి అధికారంలోకి వచ్చిన మహాయుతి ప్రభుత్వం.. ఈ మధ్యాహ్న భోజన పథకం విషయంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్డును ఇక నుంచి పెట్టకూడదని నిర్ణయించింది.
మధ్యాహ్న భోజనంలో పాఠశాల విద్యా శాఖ అందించే వంటకాల జాబితాను దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరించింది. అందులో ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల మాదిరిగానే 1వ తరగతి నుంచి 8వ తరగతుల మధ్యాహ్న భోజన మెనూ నుంచి కోడిగుడ్లు, చక్కెరను తొలగించాలని మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి బదులుగా గుడ్డు పులావ్, రాగి జావ లాంటి వంటకాన్ని అందించాలని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే స్కూళ్లలో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్డును మధ్యాహ్న భోజన పథకం నుంచి తొలగించడం పట్ల.. మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మహారాష్ట్రలో పేద విద్యార్థులు తినే భోజనం విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. గుడ్డును తొలగించడంపై దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయతి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పౌష్టికాహారం అందించడం, పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్లడం మానివేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు తీసుకువచ్చిన ఈ మధ్యాహ్న భోజన పథకంలో అందించే కోడిగుడ్లను రద్దు చేయడం పట్ల తీవ్రంగా స్పందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa