కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రైతులకు శుభవార్త అందించారు. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని పెంచడంతో పాటుగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి భారీగా నిధులు పెంచారు. ఈసారి పీఎం కిసాన్ పథకానికి ఏకంగా రూ. 63,500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. గత ఏడాది బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి రూ. 60,000 కోట్లు కేటాయించగా.. అప్పటితో పోల్చితే 5.8 శాతం ఎక్కువ కేటాయించారు. ఈ బడ్జెట్ గ్రామీణ ఆదాయం, వినియోగాన్ని పెంచుతుందని అంచనా వేసింది కేంద్రం.
పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మూడు వాయిదాల్లో రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ. 6000 బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది కేంద్రం. భూమిని కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులకి పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఫిబ్రవరి 24, 2019న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. గత ఆరేళ్ల నుంచి ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నారు. అయితే, ఈ సాయాన్ని పెంచుతారని, ఒక్కో రైతుకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తారనే వాదనలు వినిపించాయి. ఈ బడ్జెట్లోనే ప్రకటన ఉంటుందని అంతా ఎదురుచూశారు. అలాంటి ప్రకటనేమీ చేయలేదు.
కానీ నిధులు భారీగా కేటాయించిన క్రమంలో రైతుల్లో ఆశలు చిగురించాయని చెప్పవచ్చు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 18 విడతల్లో లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసారు. 2024, అక్టోబర్ నెలలో ప్రధాని మోదీ 18వ ఇన్స్టాల్మెంట్ కింద 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇందుకోసం మొత్తం రూ. 20,000 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో ఈ నెలాఖరులోపు 19వ విడత కింద రూ.2 వేలు రైతుల అకౌంట్లలోకి జమ చేస్తారని పలు నివేదికలు చెబుతున్నాయి.