కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2025-26లో రైల్వేకు రూ.2.65 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో రూ.2.52 లక్షల కోట్ల సాధారణ ఆదాయాలు, రూ.200 కోట్ల నిర్భయ ఫండ్, అంతర్గత వనరుల ద్వారా రూ.3వేల కోట్లు, బడ్జెటేతర వనరుల ద్వారా రూ.10వేల కోట్లు ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికులు, సరకు రవాణా తదితర మార్గాల ద్వారా రైల్వేకు రూ.3.02 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, బడ్జెట్లో కొత్త రైళ్ల తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రధానంగా 17,500 జనరల్ బోగీలు, 200 వందేభారత్ రైళ్లు, 100 అమృత్భారత్ రైళ్లు, 50 నమోభారత్ రైళ్లు తయారీకి నిధులు కేటాయించినట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. బడ్జెట్లో రైల్వే కేటాయింపులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నాలుగైదేళ్లలో రూ.4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు అమలవుతాయని ఆయన తెలిపారు. వీటిలో కొత్త మార్గాలు వేయడం, డబ్లింగ్, నాలుగు లైన్లుగా విస్తరణ, కొత్త నిర్మాణాలు, స్టేషన్ల అభివృద్ధి, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు.. ఇలా చాలా ఉన్నాయని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.
‘‘మార్చి నెలాఖరుకి 1,400 జనరల్ బోగీలు సిద్ధమవుతాయి.... 100 పైవంతెనల నిర్మాణానికి అనుమతులు లభించాయి.. రైల్వే సరకు రవాణా సామర్థ్యం భారీగా పెరిగింది ఇది మార్చి 31 నాటికి 1600 కోట్ల టన్నుల సామర్థ్యానికి చేరుకుని, ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంటాం.. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 100 శాతం విద్యుదీకరణ సాధిస్తాం.. రైల్వేల భద్రతకు వ్యయాన్ని రూ.1.08 లక్షల కోట్ల నుంచి రూ. 1.16 లక్షల కోట్లకు పెంచాం... వీటికి పీపీపీ పెట్టుబడులు అదనం.. ఇవి కూడా కలిపితే రైల్వేలకు మొత్తం కేటాయింపు రూ.2.64 లక్షల కోట్లు దాటుతుంది’’ అని వివరించారు.
ఇక, 2024-25 సవరించిన అంచనాల్లో భద్రతకు రూ.1,14,062 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్ అంచనాల్లో రూ.1,16,514 కోట్లు కేటాయించారు.. ఏడాదికి 4 వేల కి.మీ. కొత్త లైన్లు వేస్తున్నారు. గడిచిన పదేళ్లలో 31,180 కి.మీ. కొత్త ట్రాక్లు సిద్ధమయ్యాయి. కానీ, సిగ్నలింగ్, టెలికం కేటాయింపుల మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాటికి కేవలం రూ.6,800 కోట్లేనని, ఇవి ఏ మేరకు సరిపోవని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ మాజీ డీజీ పెదవివిరిచారు. వచ్చే ఐదేళ్లలో 44వేల కి.మీ. మార్గంలో ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, ఈ మొత్తం సరిపోదని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa