కేంద్ర ప్రభుత్వం నుంచి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న అద్భుత పథకాల్లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ గురించి ప్రధానంగా మాట్లాడుకుంటాం. ఇక్కడ బంగారం కొనుగోళ్లు తగ్గించి.. పెట్టుబడులు పెట్టేందుకు ఉద్దేశించిన స్కీమ్. ఆన్లైన్లోనే బంగారంపై ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే.. బంగారం ధర పెరిగితే దానికి తగ్గట్లుగా ప్రతిఫలం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్లు జారీ చేస్తుంటుంది. అయితే ఒకప్పుడు నెలకు కొన్ని గోల్డ్ బాండ్లు జారీ చేసేది. తర్వాత ప్రతి నెలకు ఒక ట్రాంచి విడుదల చేస్తూ వచ్చింది. ఆ తర్వాత.. ఇక ప్రతి త్రైమాసికానికి ఒకసారి చొప్పున .. మొత్తం ఆర్థిక సంవత్సరంలో నాలుగు గోల్డ్ బాండ్ ట్రాంచీల్ని జారీ చేస్తూ వచ్చింది.
అయితే గత కొంతకాలంగా.. అంటే గతేడాది ఫిబ్రవరి నుంచి కొత్తగా ఎలాంటి గోల్డ్ బాండ్లను కేంద్రం జారీ చేయలేదు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఈ గోల్డ్ బాండ్ల ఊసే లేదు. కేంద్రం కూడా ఈ పథకంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతేడాది మధ్యంతర బడ్జెట్ సమయంలో.. బంగారంపై దిగుమతుల సుంకం తగ్గించగా.. గోల్డ్ రేట్లు భారీగా దిగొచ్చాయి. అప్పుడు ప్రతిఫలం తగ్గి.. డిమాండ్ తగ్గుతుందన్న క్రమంలో ఈ స్కీమ్ రద్దు చేస్తారని వాదనలు వినిపించినా అధికారిక ప్రకటన రాలేదు.
ఇప్పుడు మాత్రం ఈ స్కీమ్కు కేంద్ర ప్రభుత్వం చరమగీతం పాడినట్లే తెలుస్తోంది. తాజాగా 2025-26 బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత.. మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. 'ఈ బడ్జెట్లో సావరిన్ గోల్డ్ బాండ్ల గురించి ఏం ప్రస్తావించలేదు. గత కొన్ని త్రైమాసికాలుగా ఎలాంటి కొత్త ట్రాంచీల్ని కూడా ఇష్యూ చేయలేదు. ఇది స్కీమ్ ముగింపునకు సంకేతంగా భావించవచ్చా?' అని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా.. దానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'యెస్, ఇన్ ఏ వే (ఒక విధంగా అవును)' అని సమాధానం ఇచ్చారు. దీనిపై ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ మాట్లాడతారని ఆమె చెప్పారు.
అప్పుడు సేథ్ కూడా గోల్డ్ బాండ్ స్కీమ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ఈ పథకం ఆర్థికంగా భారంగా మారిందని.. అందుకే కొంతకాలంగా కొత్త ట్రాంచీలు కూడా జారీ చేయట్లేదని స్పష్టం చేశారు. అయితే.. స్కీమ్ రద్దు గురించి అధికారికంగా నిర్ణయం తీసుకుంటే చెబుతామని అన్నారు.
ఇక దీనికి బలం చేకూర్చేలా బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపులు కూడా తగ్గించడం గమనార్హం. గతేడాది మధ్యంతర బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం రూ. 26,852 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లో కూడా రూ. 18,500 కోట్లే కేటాయించింది. చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో గోల్డ్ బాండ్లను ఆర్బీఐ జారీ చేయగా.. రూ. 8008 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. ఇక ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు.. గతంలో బాండ్లను కొనుగోలు చేసిన వారికి మెచ్యూరిటీ సమయంలో ఇచ్చేందుకేనని అనుకోవచ్చు.
గోల్డ్ బాండ్ స్కీమ్ కింద కనీసం గ్రాము నుంచి గోల్డ్ కొని ఇన్వెస్ట్ చేయొచ్చు. గ్రామును యూనిట్గా పేర్కొంటారు. సాధారణ ప్రజలకు గరిష్టంగా 4 కిలోల వరకు గోల్డ్ బాండ్ యూనిట్లు కొనొచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే గ్రాముపై రూ. 50 డిస్కౌంట్ వస్తుంది. ఈ స్కీమ్ కాలపరిమితి 8 సంవత్సరాలు. ఐదేళ్ల తర్వాత కూడా ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. దీనిపై చివరిసారి ఇష్యూ ప్రకారం 2.50 శాతం వడ్డీ రేటు కూడా వస్తుంది. ఈ వడ్డీ రేటు అనేది టెన్యూర్ మొత్తానికి స్థిరంగా ఉంటుంది.