ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తులు ఇంకా వస్తున్నారు...మహా కుంభమేళా గడువును పొడిగించండి.,, అఖిలేష్ యాదవ్

national |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 07:52 PM

ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్‌నగర్‌లో 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా జరుగుతోంది. జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన ఈ మహా కుంభమేళా.. ఈనెల 26వ తేదీ మహా శివరాత్రితో ముగియనుంది. అయితే 45 రోజుల పాటు సాగే ఈ మహా కుంభమేళాకు 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని.. మొదట్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అంచనా వేయగా.. అంచనాలకు మించి భక్తులు పోటెత్తారు. దేశ, విదేశాల నుంచి 34 రోజుల్లోనే ఇప్పటివరకే 50 కోట్లమందికిపైగా భక్తులు గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే కుంభమేళా ముగింపు దశకు చేరుకున్నా భక్తుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.


ఈ నేపథ్యంలోనే మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సంఖ్య తగ్గకపోవడంతో.. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. భక్తుల తాకిడి దృష్ట్యా మహా కుంభమేళాను మరిన్ని రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కుంభమేళాను 75 రోజులు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ గడువు తక్కువగా ఉందని తెలిపారు.


ప్రస్తుతం దేశంలోని ప్రతీ ఒక్కరు మహా కుంభమేళాకు వెళ్లి అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయాలని అనుకుంటున్నారని.. కానీ వెళ్లలేకపోతున్నారని అఖిలేష్ యాదవ్ తెలిపారు. అందుకే ప్రభుత్వం ఈ మహా కుంభమేళా నిర్వహణ గడువు పెంచాలని అఖిలేష్ యాదవ్‌ సూచించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని పేర్కొన్నారు. ఈ గడువును పొడిగిస్తే మరికొంత మంది వచ్చి పుణ్యస్నానాలు చేస్తారని తెలిపారు.


దేశ విదేశాల నుంచి ప్రతీ రోజు సరాసరి కోటిన్నర మంది మహా కుంభమేళాకు వస్తున్నట్లు యూపీ ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఇక గత నెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా ఒకేరోజు దాదాపు 8 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇక మహా కుంభమేళాకు ఈసారి వచ్చిన భక్తుల సంఖ్య 50 కోట్లు దాటినట్లు తెలిపిన యూపీ ప్రభుత్వం.. దీనిపై స్పందించింది.


భారత్‌, చైనా తప్ప ప్రపంచంలోని అన్ని దేశాల జనాభా సంఖ్య కంటే ఈసారి మహా కుంభమేళాలో స్నానాలు చేసిన వారి సంఖ్య అధికమని ప్రకటించింది. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ అని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa