ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఈఆర్‌సీ క్లారిటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 07:16 PM

విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి-ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. 2025-2026 ఏడాదికి సంబంధించిన విద్యుత్ టారిఫ్‌లను తాజాగా ఏపీఈఆర్సీ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈసారి ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపు ఉండదని ఏపీఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీఈఆర్సీ ఛైర్మన్.. ఏ విభాగంలోనూ విద్యుత్‌ ఛార్జీలను పెంచలేదని ప్రకటించారు. సాధారణంగా టారిఫ్‌ల ప్రకటనను మార్చి 31వ తేదీలోపు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. ఈసారి మాత్రం నెలరోజుల ముందుగానే ఫిబ్రవరిలోనే వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేశారు.


మరోవైపు.. గతేడాది చివర్లోనే రాష్ట్రంలో ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని సూత్రప్రాయంగా తెలిసింది. ఏపీలోని డిస్కం కంపెనీలు వార్షిక ఆదాయ నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను ఏపీఈఆర్‌సీకి అందించాయి. ఆ రిపోర్టులో విద్యుత్‌ ఛార్జీల పెంపును డిస్కంలు ప్రతిపాదించలేదు. 2025-26లో రూ.58,868.52 కోట్లు కావాల్సి ఉండగా.. రూ.44,185.28 కోట్ల ఆదాయమే వస్తుందని పేర్కొన్నాయి అదే సమయంలో రూ.14,683.24 కోట్ల లోటు ఉంటుందని తెలిపాయి. అయితే లోటు ఉన్నప్పటికీ.. విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారం మోపలేదు.


2024-25 ఏడాదితో పోలిస్తే 2025-26లో 3.93 శాతం అధికంగా.. 75,926.22 మిలియన్ యూనిట్ల విక్రయాలు ఉంటాయని డిస్కంలు అంచనా వేశాయి. ఇక వ్యవసాయానికి అందించే ఉచిత ఉచిత విద్యుత్‌కు 12,927 మిలియన్‌ యూనిట్ల కరెంటు అవసరం అవుతుందన్నారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో ఒక్కో యూనిట్‌ కొనుగోలు వ్యయం రూ. 4.80 చొప్పున ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం సవరించిన అంచనాల ప్రకారం విద్యుత్‌ కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ. 5.12 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ అంచనాలను పరిశీలించిన తర్వాత 2025-26కు సంబంధించి అవసరమైన మార్పులను కమిటీ సూచిస్తుంది.


ఇక ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్‌ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఏపీఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ నేతృత్వంలో అధికారుల బృందం విజయవాడలోని రెండురోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు. ఆ తర్వాత జనవరి 10వ తేదీన కర్నూలులోనూ ఈ ప్రజాభిప్రాయన సేకరణ జరిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa