సాదారణంగా ఏ కంపెనీలోనైనా తినడానికి, టీ, స్నాక్స్ బ్రేకుల కోసం ఇంత సమయాన్ని మాత్రమే వాడాలంటూ నిబంధనలు పెడుతుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం టాయిలెట్ల వాడకంపై కూడా నిబంధలు పెట్టింది. కేవలం 2 నిమిషాలు మాత్రమే బాత్రూంలు వాడాలని చెప్పింది. ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తే.. 1200 రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుందని కూడా వివరించింది. ఈ నిబంధనతో కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు నిమిషాల్లోనే బాత్రూం వాడకం ఎలా సాధ్యం అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
చైనాకు చెందిన త్రీ బ్రదర్స్ మెషిన్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎవరూ ఊహించని, అందరూ విమర్శించే ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా టాయిలెట్ల వాడకంపై ఉద్యోగులకు టైమ్ స్లాట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 2 నిమిషాల్లోనే బాత్రూంకు వెళ్లి రావాలని చెప్పింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సేపు బాత్రూంలోనే ఉంటే 100 యువాన్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.1200) జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఫిబ్రవరి 11వ తేదీ నుంచే ఈ నిబంధనను అమల్లోకి తీసుకు రాగా.. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈక్రమంలోనే సదరు కంపెనీ స్పందిస్తూ.. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా ఈ నిబంధనలను అమల్లో ఉంచుతామని.. మార్చి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేస్తామని చెప్పారు. అయితే ఈ విధానం ప్రారంభించడం వెనుక ఓ కారణం ఉన్నట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన ప్రాచీన చక్రవర్తి ఎల్లో ఎంపరర్ చేసిన ఆరోగ్య సూత్రాలను స్ఫూర్తిగా తీసుకుని రెండు నిమిషాల టాయిలట్ వాడకం విధానాన్ని తీసుకు వచ్చారట.
అయితే కంపెనీలో పని చేసే ఉద్యోగులు అంతా కేవల 2 నిమిషాల్లోనే బాత్రూం వెళ్లి రావాల్సి ఉండగా.. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కాస్త వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. అలాంటి ఉద్యోగులు అంతా హెచ్ఆర్ విభాగం వద్దకు వెళ్లి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని కూడా సూచించింది. అంతేకాకుండా ఇలా అదనపు సమయం వాడుకున్నందుకు వారి జీతంలో కోత కూడా విధిస్తామని ప్రకటించింది.
ఈ విషయం తెలుసుకున్న కంపెనీ ఉద్యోగులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేం నిబంధన, 2 నిమిషాల్లోనే టాయిలెట్లకు వెళ్లి ఎలా రాగలరు అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి కంపెనీల్లో పని చేయడం కంటే ఉద్యోగాలు మానేయడమే మంచిదని చెబుతున్నారు. ఈ సందర్భంగానే చైనాకు చెందిన న్యాయవాది చెన్ షిజింగ్ మాట్లాడుతూ.. ఇది కార్మిక చట్టాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చారు. చూడాలి మరి తీవ్ర వ్యతిరేకతతో కంపెనీ ఈ నిబంధనను ఆపేస్తుందా లేక కంటిన్యూ చేస్తుందా అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa