ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ శక్తికాంత దాస్కు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని వద్ద కీలక పదవి లభించింది. శక్తికాంత దాస్ నియామకానికి సంబంధించి.. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే శక్తికాంత దాస్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా.. శక్తికాంత దాస్ పదవీ కాలం ప్రధానమంత్రి పదవీ కాలంతో సమానంగా ఉంటుంది. లేదా కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఇచ్చే తదుపరి ఆదేశాలు వరకు కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.
అయితే ప్రధాని నరేంద్ర మోదీకి.. మాజీ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ప్రస్తుతం మొదటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 సెప్టెంబర్ 11వ తేదీ నుంచి పీకే మిశ్రా ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇప్పుడు శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఈ క్రమంలోనే పీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా శక్తికాంత దాస్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్బీఐ గవర్నర్గా 2018 నుంచి 2023 వరకు 6 ఏళ్ల పాటు పనిచేసిన శక్తికాంత దాస్కు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో విశేష అనుభవం ఉంది. అంతేకాకుండా ఎకనామిక్స్, ఫైనాన్స్, మినరల్స్, రెవెన్యూ శాఖలతోపాటు జీ20 షెర్ఫా, ఏడీబీ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ వ్యవహారాలపైనా ఆయన గట్టి పట్టు కలిగి ఉన్నారు. కరోనా మహమ్మారి వెలుగుచూసిన సమయంలో ఆర్బీఐ గవర్నర్గా ఉన్న శక్తికాంత దాస్.. దేశం ఆర్థిక పునరుద్ధరణతో సహా క్లిష్టమైన ఆర్థిక సవాళ్ల నుంచి దేశాన్ని బయటికి తీసుకురావడంలో తనవంతు కీలక పాత్రను పోషించారు. ఇక ఆర్బీఐలో శక్తికాంత దాస్ పదవి కాలం నిర్ణయాత్మక ద్రవ్య విధానాలు, సంక్షోభాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.
అయితే కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ.. కేవలం శక్తికాంత దాస్ నియామకంతోపాటు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం పదవీకాలాన్ని కూడా ఒక ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బీవీఆర్ సుబ్రమణ్యం ప్రస్తుత పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుండగా.. తాజాగా పొడగించారు. ఈ పొడగింపు వల్ల 2026 ఫిబ్రవరి 24వ తేదీ వరకు నీతి ఆయోగ్ సీఈఓ పదవిలో బీవీఆర్ సుబ్రమణ్యం కొనసాగనున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన సుబ్రమణ్యం 1987 బ్యాచ్కు చెందిన వారు. 2023 ఫిబ్రవరిలో నీతి ఆయోగ్ సీఈవోగా రెండేళ్ల పదవీకాలానికి ఆయనను నియమించగా.. తాజాగా మరో ఏడాదిపాటు పొడిగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa