ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేని శాఖకు మంత్రి.. .. జుట్టు పీక్కునేలా చేస్తున్న పంజాబ్ సర్కారు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 09:04 PM

ఉనికిలోనే లేని ఓ శాఖకు పంజాబ్ ప్రభుత్వం ఓ మంత్రిని కేటాయించింది. ఆయన కూడా ఏడాదిన్నర కాలంగా ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే 20 నెలల తర్వాత సర్కారు.. ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో దాన్ని సవరించేందుకు ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని గుర్తించిన ప్రజలు, ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకుంటుండగా.. బీజేపీ మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇదేం చోద్యమంటూనే.. పరిపాలను ఆమ్ ఆద్మీ పార్టీ జోక్‌గా తీసుకుందని చెప్పుకొచ్చింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


2022వ సంవత్సరంలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఆమ్ అద్మీ పార్టీ విజయం సాధించింది. ఈక్రమంలోనే ఆప్ భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2023 మే నెలలో కుల్దీప్ సింగ్ ధలివాల్‌కు రెండు శాఖలు కేటాయిస్తూ మంత్రిగా ప్రకటించారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐ వ్యవహారాలు సహా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ల్‌మెంట్ బాధ్యతలను అప్పగించింది. ఇదంతా బాగానే ఉండగా.. 2024 చివరలో పంజాబ్ ప్రభుత్వం మరోసారి పునర్వ్యవస్థీకరణ చేసింది.


ముఖ్యంగా 2024 సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆధ్వర్యంలో సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తాజాగా దీన్ని మారుస్తున్నంటూ మరోసారి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే గతంలో విడుదల చేసిన దాంట్లో మంత్రి కుల్దీప్ సింగ్‌కు కేటాయించిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని కూడా చెప్పుకొచ్చింది. దీన్ని గుర్తించిన ప్రజలు సహా ప్రతిపక్షాలు ముక్కున వేలేస్కుంటున్నాయి. కానీ బీజేపీ మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. అసలు సీఎంకు కూడా తెలియని ఓ శాఖను మంత్రికెలా కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


పంజాబ్‌లో పాలలను ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జోక్‌గా తీసుకుందని బీజేపీ ఆరోపించింది. అసలు ఉనికిలోనే లేని శాఖకు మంత్రిని కేటాయించడం ఏంటని.. అందులోనూ దానికి ఆయన 20 నెలలుగా బాధ్యతలు నిర్వహించడం ఏంటోనంటూ వ్యగ్యాస్త్రాలు విసిరింది. ఈ విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు కూడా తెలియకపోవడం దారుణం అని చెప్పుకొచ్చింది. అసలు పంజాబ్ సర్కారు పరిస్థితి ఎలా ఉందో ఈ ఒక్క విషయం చూస్తేనే అర్థం అయిపోతుందంటూ మండిపడింది. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa