దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకోగా.. ఆమె ఇటీవలె రామ్లీలా మైదానంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో పాలనపై రేఖా గుప్తా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చేందుకు.. తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇప్పటికే సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు. అందులో భాగంగానే తొలి రోజు నుంచే కీలక నిర్ణయాలను తీసుకోవడం ప్రారంభించారు. అదే సమయంలో ఢిల్లీ ఎన్నికల మేనిఫేస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం.. మహిళలకు నెల నెలా అకౌంట్లలో రూ.2500 జమ చేస్తామని.. తాజాగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పష్టం చేశారు.
ఢిల్లీలోని అర్హులైన మహిళలకు మార్చి 8వ తేదీ నుంచి నెలకు రూ.2,500 మొత్తాన్ని వారి ఖాతాల్లోకి జమచేయనున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరును ప్రకటించిన తర్వాత మాట్లాడిన ఆమె.. హామీలన్నింటినీ బీజేపీ నెరవేరుస్తుందని చెప్పింది. అయితే ఈ పథకం ఢిల్లీ కొత్తగా తీసుకువచ్చేది కాదు. గతంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం.. మహిళలకు ప్రతీ నెలా అందించింది. ఇక ఎన్నికల వేళ.. తాము ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తే అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ. 2,100 ఇస్తామని ప్రకటించింది. అందుకు ప్రతిగా.. తాము అధికారంలోకి వస్తే రూ. 2,500 ఇస్తామని బీజేపీ ప్రకటించింది.
ఢిల్లీ ఎన్నికల వేళ బీజేపీ ఇచ్చిన హామీలు
అర్హులైన మహిళలకు నెలకు రూ.2500
రూ. 500కే గ్యాస్ సిలిండర్.. హోలీ, దీపావళి పండగలకు ఒక్కో ఉచిత సిలిండర్
గర్భిణీలకు రూ.21 వేలు సాయం, 6 పోషకాహార కిట్లు అందజేత
మురికివాడల్లో నివసించే ప్రజలకు రూ.5 లకే భోజనం
ఢిల్లీలోని ప్రజలందరికీ ఉచితంగా రూ.10 లక్షల వైద్య చికిత్స
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలను సాకారం చేయడం.. ఢిల్లీలోని 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల బాధ్యత అని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. మహిళలకు ఆర్థికంగా సహాయం అందించేందుకు తమ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కచ్చితంగా నెరవేరుస్తామని తేల్చి చెప్పారు. మార్చి 8వ తేదీ నాటికి మహిళల ఖాతాల్లో తప్పకుండా డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఇక ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకుంది. 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితం అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa