ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా వెళ్లే భారతీయులపై గోల్డ్‌కార్డ్ వీసా ప్రభావం

international |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 10:49 PM

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా పౌరులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు కూడా ప్రభావితం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ క్షణంలో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం పెడతారో అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఇక తాజాగా ట్రంప్‌ ప్రతిపాదించిన గోల్డ్‌కార్డ్‌ వీసా పెను సంచలనంగా మారింది. అయితే అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న ప్రపంచ దేశాల ప్రజల ఆశలపై ఈ గోల్డ్‌కార్డ్ వీసా నీళ్లు చల్లింది. ఇక అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలన్న భారతీయుల్లో ట్రంప్ నిర్ణయం గుబులు రేపుతోంది.


భారీగా డబ్బులు చెల్లించి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని కొనుగోలు చేసే విధానమే ఈ గోల్డ్‌కార్డ్ వీసా. అయితే 5 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.43.54 కోట్లు చెల్లించిన వారికి ఈ గోల్డ్‌కార్డ్ వీసాను అందించనున్నారు. ఇప్పుడు ఇదే అమెరికా పౌరసత్వం కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వారికి పెద్ద షాక్‌లాగా మారింది. ఇందులో భారతీయులే అధికంగా ఉండటం గమనార్హం. అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం వేచివున్న అత్యధిక మందిలో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు. వీరికి కనీసం గ్రీన్‌కార్డు కావాలంటే ఇంకా 50 ఏళ్ల పట్టొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్‌ తీసుకువచ్చిన గోల్డ్‌కార్డ్ వీసా ప్రతిపాద వారిలో గుబులు రేపుతోంది.


ఇక ఈ గోల్డ్‌కార్డ్ వీసా రావడంతో అమెరికా వలస విధానంలో విప్లవాత్మక మార్పులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు అమల్లో ఉన్న ఈబీ-5 వీసా ప్రోగ్రామ్‌ కూడా రద్దు అవుతుందని పేర్కొంటున్నారు. అయితే ఈ ఈబీ-5 వీసా ప్రకారం 8 లక్షల డాలర్ల (రూ.6.68 కోట్లు) నుంచి 10.5 లక్షల డాలర్లు (రూ.9.14 కోట్లు) అమెరికాలో పెట్టుబడి పెట్టి.. కనీసం 10 ఉద్యోగాలనైనా సృష్టించాలి. 1992లో అమెరికన్ కాంగ్రెస్‌ ఈబీ-5 వీసా ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.


ఈ నేపథ్యంలోనే అమెరికా గ్రీన్‌కార్డు పొందేందుకు అప్లై చేసుకున్న వారి జాబితాలో అత్యధికంగా భారతీయులే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ గోల్డ్‌కార్డ్ వీసాతో బాగా డబ్బున్న భారతీయులకు మాత్రమే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. కానీ చాలా మందికి అది అందని ద్రాక్షగానే మారే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఉన్న ఈబీ-5 వీసా ప్రోగ్రామ్‌ను గోల్డ్‌కార్డు వీసాతో రెండు వారాల్లో భర్తీ చేస్తామని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్‌ లుథ్నిక్‌ తేల్చి చెప్పారు. ఇక ఇప్పటికే ఈబీ-5 వీసా ప్రోగ్రామ్‌ను ట్రంప్‌ తీవ్రంగా తప్పుపట్టారు.


ప్రస్తుతం హెచ్‌-1బీ, ఈబీ-2, ఈబీ-3 వీసాపై ఉన్నవారు కూడా ఈ గోల్డ్ కార్డ్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు 5 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం దాదాపు 10 లక్షల గోల్డ్‌కార్డు వీసాలను జారీ చేయవచ్చని తెలుస్తోంది. ఇక కోటి గోల్డ్ కార్డ్ వీసాలు విక్రయిస్తే అమెరికా ద్రవ్యలోటు కూడా కొంత తగ్గుతుందని ట్రంప్‌ అభిప్రాయం పడుతున్నట్లు సమాచారం. అయితే ఎన్ని జారీ చేస్తారు అనేదానిపై కచ్చితంగా చెప్పలేదు. ఇక ఈ గోల్డ్ కార్డ్ వీసాలు కొనుగోలు చేసే స్థోమత లేని వారు ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3, హెచ్‌-1బీ వీసాల ద్వారా అమెరికా వీసాలు పొందవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa