సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నేడు రూ.3.22 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్ తోనే నిరూపితమైందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్... సూపర్ ఫ్లాప్ అని విమర్శించారు."కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య ఘనం-కేటాయింపులు శూన్యం... అంతా అంకెల గారడీ-అభూత కల్పన... దశ దిశ లేని పస లేని బడ్జెట్ ఇది రాష్ట్రం గుల్ల-బడ్జెట్ అంతా డొల్ల ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారు సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు" అంటూ షర్మిల ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్ లో విజన్ లేదు, విజ్ డమ్ లేదు అంతా ఇంద్రజాలమే మిషన్ లేదు మీనింగ్ లేదు కేవలం మహేంద్రజాలమే అంటూ విమర్శించారు. "అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,300 కోట్లు కేటాయిస్తే ఏ మూలకు వస్తుంది రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి రూ.11 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటే కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కోసం రైతులు ఎదురుచూసేలా చేయడం అన్యాయం కాదా గిట్టుబాటు ధర కోసం రైతులు అల్లాడుతుంటే ధరల స్థిరీకరణ కోసం రూ.300 కోట్లు ముష్టి వేయడం ద్రోహమే అవుతుంది. తల్లికి వందనం పథకంలోనూ కోత పెట్టారు. రాష్ట్రంలోని 84 లక్షల మంది విద్యార్థులకు రూ.12,600 కోట్లు కావాల్సి ఉంటే బడ్జెట్ లో రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. దీన్ని బట్టి లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్యను భారీగా తగ్గించినట్టే కదా.దీపం-2 పథకానికి ఏడాదికి రూ.4,500 కోట్లు అవసరమైతే బడ్జెట్ లో రూ.2.601 కోట్లు కేటాయించారు. లబ్ధిదారుల సంఖ్య 1.5 కోట్లు అయితే, సగం నిధులే కేటాయించి ఎంతమేర లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టదలచుకున్నారు? ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు. రూ.3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టారు కానీ, రూ.350 కోట్లు కేటాయించే పథకానికి నిధులు ఇవ్వడానికి మనసు రాలేదు. మహిళలకు మహాశక్తి పథకం కింద నెలకు రూ.1500 ఇస్తామన్నారు ఇప్పుడా పథకాన్ని మాయం చేశారు. రూ.10 లక్షల వరకు ఉచిత రుణాలు అని చెప్పి డ్వాక్రా మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు, జాబ్ కాలెండర్ ఊసే లేదు. బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించకుండా 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. రాష్ట్ర రాజధానికి బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించకుండా అప్పులతోనే అమరావతి కట్టాలని భావించడం మీ అవివేకానికి నిదర్శనం. ప్రజలను మోసం చేసి... ఎన్నికల హామీలను గాలికి వదిలేసి మసిపూసి మారేడు కాయ చేశారు" అంటూ షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa