ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సమయంలో ఆయన ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేశారని ఆరోపణలు వచ్చాయి. జార్జియాకు వెళ్లినపుడు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారని, స్వీడన్ యూకే, యూఏఈ సహా పలు దేశాల పర్యటనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి పొందలేదని సమాచారం. ఈ ఆరోపణలపై ప్రభుత్వం సిసోడియా నేతృత్వంలోని కమిటీతో విచారణ జరిపించింది.విచారణలో కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధంగా ప్రవర్తించారని కమిటీ తేల్చింది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విదేశీ పర్యటనలతో పాటు సునీల్ కుమార్ పై పలు ఇతరత్రా ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధింపులకు గురిచేసిన ఘటనలోనూ సునీల్ కుమార్ పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, గతంలోనూ పీవీ సునీల్ కుమార్ పలు అరాచకాలకు పాల్పడ్డారని, చాలా మందిని నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా దగ్గరుండి అధికారులను ఆదేశించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa