ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతిలో విజయవంతంగా మరో గుండె మార్పిడి చికిత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 11:29 AM

విజయవాడ నుంచి ఒక గుండె ప్రయాణం సాగింది. ఆ 32 ఏళ్ల వ్యక్తి గుండెను.. 20 ఏళ్ల యువకుడికి తిరుపతిలో అమర్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయవాడకు చెందిన ప్రదీ్‌ప (32)కు అక్కడి క్యాపిటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారు. అంత విషాదంలోనూ గుండె దిటవు చేసుకున్న అతడి కుటుంబ సభ్యులు.. మరొకరి ప్రాణం నిలిపేందుకు అవయవదానానికి ముందుకొచ్చారు. అదే సమయంలో గుండె సంబంధిత వ్యాధితో నెల రోజులుగా తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 20 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి చేయాల్సి ఉంది. జీవన్‌దాన్‌ పోర్టల్‌లో ఈ వివరాలు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రదీప్‌ వియం తెలిసి శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి.. ప్రత్యేక బృందంతో శనివారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. ప్రదీప్‌ గుండెను ఆదివారం అంబులెన్సులో గన్నవరం విమానాశ్రయానికి.. అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 4.10గంటలకు తీసుకొచ్చారు. అప్పుడే సిద్ధంగా ఉన్న ప్రత్యేక అంబులెన్స్‌లో ఆ గుండెను పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్‌కి తరలించారు. గుండె ప్రయాణ సమయంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. 4.30 గంటలకంతా శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రికి గుండె చేరుకుంది. ఆ వెంటనే గుండె మార్పిడి శస్త్రచికిత్స చేపట్టారు. కాగా, శ్రీపద్మావతి హృదయాలయలో ఇప్పటి వరకు 17 శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ఇది 18వది కావడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa