ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నలుగురు స్పిన్నర్లతో.. ఏం గేమ్ ప్లాన్ గంభీర్ గురూ

sports |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 08:03 PM

ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్క్వాడ్‌ను ఫైనల్ చేసినప్పుడు గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు ఐదుగురు స్పిన్నర్లతో ఎవరైనా స్క్వాడ్ డిజైన్ చేస్తారా? పేస్ బౌలర్లు ముగ్గరంటే ముగ్గురేనా? కేవలం ఇద్దరు పేసర్లతోనే మ్యాచ్ ఆడేస్తాడా? ఇలాంటి ఎన్నో విమర్శలు గంభీర్‌వైపు బాణాల్లా వెళ్లాయి. కానీ తన గేమ్ ప్లాన్ తనకుంది అన్నట్టు గంభీర్ ఆ విమర్శలను పట్టించుకోలేదు. కట్ చేస్తే గ్రూప్ స్టేజ్‌ ఆఖరి మ్యాచ్‌లో గంభీర్ గేమ్ ప్లాన్ చూసి అందరూ షాకయ్యారు.


దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఎవ్వరూ ఊహించనట్టు భారత జట్టు ఉంది. కోచ్ గంభీర్ ఏకంగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇలా నలుగురు స్పిన్నర్లను బరిలో దించడమే కాకుండా మ్యాచ్‌ని కూడా గెలిపించుకున్నాడు. తొమ్మిది వికెట్లు స్పిన్నర్లే తీయడం విశేషం.


ఆఖరి నిమిషంలో టీమిండియా స్క్వాడ్‌లో చేరిన వరుణ్ చక్రవర్తి తనని తాను నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లతో తాను సమ్‌థింగ్ స్పెషల్ అని నిరూపించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన వరుణ్ అదే ఫామ్‌ని న్యూజిలాండ్‌పై చూయించాడు. పది ఓవర్లు బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి కేవలం 42 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.


మ్యాచ్‌ని మలుపుతిప్పేలా


వరుణ్ చక్రవర్తి తన బంతులతో మ్యాచ్‌ని మలుపుతిప్పాడు. క్రీజులో కుదురుకున్న విల్ యంగ్‌ని పెవిలియన్‌కు పంపడమే కాకుండా దూకుడుగా ఆడుతున్న గ్లెన్ ఫిలిప్స్‌ను ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. ఆఖర్లో బౌండరీలు బాదుతున్న మిచెల్ శాన్‌ట్నర్‌కి మెరుపు వేగంతో బంతిని విసిరి క్లీన్ బౌల్డ్ చేశాడు.


చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తన స్పిన్ మాయాజాలాన్ని చూయించాడు. విలియమ్సన్‌కు సపోర్టింగ్‌గా ఆడుతున్న డారెల్ మిచెల్‌ను ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. ఆఖర్లో విలియమ్ ఓరూక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ దక్కించుకున్నాడు.


షమీ మినహా అందరికీ వికెట్లు


న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ మినహా మిగతా అందరు బౌలర్లు వికెట్లు తీసుకున్నారు. అయితే షమీ కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. షమీ, హార్దిక్ ఎనిమిది ఓవర్లు వేయగా.. మిగతా 37.3 ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీయగా కుల్దీప్ యాదవ్ రెండు పడగొట్టాడు. ఐసీసీ వేదికలపై డెబ్యూ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.


న్యూజిలాండ్‌తో గెలిచిన భారత్ గ్రూప్-ఏలో టాప్ ప్లేస్‌కు చేరకుంది. ఈ నెల 4న జరిగే సెమీ ఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో తలపడనుంది. అదేవిధంగా మరో సెమీ ఫైనల్స్‌లో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టు గ్రూప్-బీ టాపర్ సౌతాఫ్రికాతో ఈ నెల 5న లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa