ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాక్స్ నోటీసులు పంపిస్తున్న ఐటీ శాఖ

business |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 11:46 PM

మన దేశంలో నిర్దిష్ట ఆదాయానికి మించి ఉంటే.. ఆ సంపాదనపై టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం- 1961 కింద.. పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాల కింద ఏది ఎంచుకుంటే దాంట్లోని టాక్స్ శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి. పాత ఆదాయపు పన్ను విధానంలో టాక్స్ రిబేట్ రూ. 5 లక్షలుగా ఉండగా.. కొత్త పన్ను విధానంలో ఇటీవల బడ్జెట్ సమయంలో రూ. 12 లక్షలకు పెంచింది. పాత దాంట్లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలుగా ఉండగా.. వేతన జీవులు రూ. 5.50 లక్షల వరకు పన్ను కట్టనక్కర్లేదు. ఇదే కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలు కాగా.. ఇక్కడ రూ. 12.75 లక్షల వరకు టాక్స్ ఉండదు. ఇక ఆ పరిమితి దాటితే టాక్స్ చెల్లించాలి. ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.


ఇంకా కనీస పన్ను మినహాయింపు పరిమితి దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఐటీఆర్ ఫైల్ చేయాలని ఐటీ చట్టం చెబుతుంది. కొత్త పన్ను విధానంలో ఇది రూ. 4 లక్షలుగా ఉంది. అంటే 0-4 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన పని లేదు. ఆపైన ఆదాయం ఉన్న వారు.. పన్ను పడకున్నా జీరో ఐటీ రీటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ దీనిని పెద్దగా పట్టించుకోట్లేదు. ఇదే సమయంలో నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటినా.. ఆ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉన్నా కూడా కొందరు పెడచెవిన పెడుతున్నారు. అంటే ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించి.. టాక్స్ ఎగ్గొడుతున్నారన్నమాట.


ఇలాగే గత ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉన్నా.. ఐటీఆర్ ఫైల్ చేయకుండా తప్పించుకుంటే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఇప్పుడు వారిని ఐటీ శాఖ గుర్తించింది. ఐటీ డిపార్ట్‌మెంట్ సర్క్యులర్ ప్రకారం.. ఇప్పటికే సదరు లిస్ట్ తయారైంది. ఇన్‌కంటాక్స్ బోర్డు ఇప్పటికే దీనికి ఆమోదం కూడా తెలిపింది. ఇన్‌కంటాక్స్ అసెసింగ్ ఆఫీసర్స్‌కు (AO) ఈ లిస్ట్ పంపగా.. వారు నోటీసుల్ని కూడా పంపిస్తున్నారు. దీంతో వారిపై సెక్షన్ 148A కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఎక్కువగా 2018-19, 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిందేనని తెలుస్తుంది.


ఆదాయపు పన్ను శాఖ AIS (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్), టీడీఎస్/టీసీఎస్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్స్ వంటి వాటి ద్వారా ఇలా టాక్స్ ఎగ్గొట్టేవారిని గుర్తించింది. ఇది పూర్తి స్థాయిలో పూర్తయితే.. పన్ను ఎగ్గొట్టిన వారిందరికీ కూడా నోటీసులు పంపి.. ఇతర చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ వీరు జాగ్రత్తపడేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఇలా ఎవరైనా చేసినట్లయితే.. కొంతవరకైనా నష్టనివారణ చర్యలు చేసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. కండోనేషన్ ఆఫ్ డిలేకు అప్లై చేసుకోవడం లేదా వడ్డీతో కలిపి టాక్స్ చెల్లించడం వంటివి చేయడం ద్వారా ఊరట పొందొచ్చని అంటున్నారు నిపుణులు. ఇందులో మొదటిదానికి అయితే నెలలు పడుతుందని.. రెండో దానిపైనా నోటీసులు రాకుండా అడ్డుకోవడం కష్టమేనని.. పెనాల్టీలు పడతాయని అంటున్నారు. రెండూ బ్యాడ్ ఆప్షన్స్ అయినప్పటికీ.. అందులో బెస్ట్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa