కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దర్శనానికి నిత్యం వందలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కాణిపాకం వినాయకుడి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా కాణిపాకం దేవస్థానం కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ వస్తోంది. అయితే కాణిపాకానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నదాన భవనం లేకపోవటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల సంఖ్యకు తగినట్లుగా అన్నదాన భవనం లేకపోవటంతో చాలామంది భక్తులు అన్నప్రసాదం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు కాణిపాకం దేవస్థానం చర్యలు చేపట్టింది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు సామూహిక కల్యాణ మండపాన్ని అన్నదాన భవనంగా మార్చనున్నారు. ఇందులో అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నారు. కాణిపాకం ఆలయంలో ప్రస్తుతం రోజుకు రెండున్నర వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో ఒకసారి 200 మంది వరకూ భోజనం చేసే వీలుంది. అయితే మొదటి దశలో కళ్యాణ మండపాన్ని అన్నదాన భవనంగా మార్చడం ద్వారా.. ఆ భవనంలో ఒకేసారి 450 మంది కూర్చొని భోజనం చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత వివిధ దశల్లో ఈ సంఖ్యను 5 వేలకు పెంచనున్నారు. తొలి దశలో భాగంగా రూ.80 లక్షలతో వంట గదులు నిర్మిస్తున్నారు. కళ్యాణ మండపాన్ని అన్నదాన భవనంగా మార్చే ప్రక్రియను మే నాటికి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని కాణిపాకం ఆలయ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరోవైపు ఆలయాల్లో కల్పిస్తున్న వసతులు, దర్శనం, ప్రసాదం వంటి అంశాల్లో కాణిపాకం ఆలయం మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూడు అంశాలపై రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవాలయాల్లో భక్తుల నుంచి ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు అభిప్రాయ సేకరణ జరిపారు. అనంతరం వాటికి ర్యాంకులు కేటాయించారు. ఈ జాబితాలో కాణిపాకం ఆలయం మొదటి స్థానంలో నిలవగా.. అన్నవరం ఆఖరి స్థానంలో ఉంది. కాణిపాకం తొలి స్థానంలో నిలిస్తే, ఆ తర్వాత శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, సింహాచలం అప్పన్న ఆలయం, శ్రీశైలం మల్లిఖార్జునస్వామి ఆలయం, అన్నవరం దేవస్థానాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa