ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎండాకాలంలో వాతావరణ శాఖ చల్లటి కబురు.. సైక్లోన్ ఎఫెక్ట్‌తో భారీ వర్షాలు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 07:28 PM

ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఎప్పుడైనా మార్చి నెలలో ఎండలు ప్రారంభమై నెలాఖరు వరకు తీవ్ర రూపం దాల్చేవి. కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు మొదలు కాగా.. ఇప్పటివరకే సూరీడు సుర్రుమంటున్నాడు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల వేళ ఐఎండీ చల్లటి వార్తను చెప్పింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ వానలు పడతాయని.. వాటి లిస్ట్‌ను కూడా వెలువరించింది. వాతావరణ శాఖ వర్ష సూచనలతో ఆయా రాష్ట్రాలకు భారీ ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది.


ఇరాక్, బంగ్లాదేశ్‌ దేశాల్లో నెలకొన్న సైక్లోన్ల ఎఫెక్ట్ కారణంగా భారత్‌లోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మార్చి 13వ తేదీ (గురువారం) రోజున అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు.


ఇక మార్చి 14వ తేదీ (శుక్రవారం), మార్చి 15వ తేదీ (శనివారం) రోజుల్లో జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మార్చి 13, 14, 15వ తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాల గురించి ఆయా రాష్ట్రాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.


మొదటి సైక్లోన్ ఇరాక్ నుంచి ఉత్తర భారత దేశం వైపు కదులుతోందని ఐఎండీ పేర్కొంది. దీని కారణంగా ఢిల్లీ, ఢిల్లీ ఎన్సీఆర్, పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం నమోదు అవుతున్న అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించే అవకాశం ఉందని తెలిపింది. ఇక రెండో సైక్లోన్ బంగ్లాదేశ్ నుంచి తూర్పు, ఈశాన్య భారతదేశ రాష్ట్రాల వైపు కదులుతోందని వెల్లడించింది. ఈ తుఫాన్ కారణంగా ఉత్తర, తూర్పు, ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.


మార్చి 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీగా మంచు, వర్షం, ఉరుములు ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మార్చి 12, 13వ తేదీల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మార్చి 13 నుంచి 15 వరకు రాజస్థాన్‌లోనూ అదే రకమైన ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa