వివాహం తర్వాత పురుషుడు గానీ స్త్రీ గానీ.. తమ స్నేహితులతో అసభ్యకరమైన చాటింగ్ చేయడం అంగీకరించే చర్య కాదని.. మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. ఏ భర్త కూడా తన భార్య నుంచి అలాంటి అసభ్యకరమైన చాటింగ్ను సహించలేడని స్పష్టం చేసింది. లైంగికపరమైన విషయాలను బాయ్ఫ్రెండ్స్తో భార్య పంచుకోవడాన్ని చూసి ఏ భర్త తట్టుకోలేడని వెల్లడించింది. ఓ జంటకు కింది కోర్టు విడాకులు మంజూరు చేయగా.. ఆ తీర్పును భార్య అప్పీలు చేయగా.. విచారణ జరిపిన మధ్యప్రదేశ్ హైకోర్టు.. కిందికోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భార్య తీరు క్రూరత్వం కిందికే వస్తుందని పేర్కొంటూ.. వారిద్దరికీ విడాకులు మంజూరు చేయడం సరైందేనని తేల్చి చెప్పింది.
కేసు వివరాల ప్రకారం.. ఓ యువతి, యువకుడు 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ పెళ్లి అయిన తర్వాత కూడా మగ స్నేహితులతో కొనసాగిస్తున్న సంబంధాలను.. వాళ్లతో చేస్తున్న అసభ్యకరమైన చాటింగ్ను భర్త గుర్తించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భర్త.. తన భార్య నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు.. వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే ఆ విడాకుల తీర్పును భార్య.. మధ్యప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ చేసింది.
ఈ క్రమంలోనే విచారణ జరిపిన మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వివేక్ రోసియా, జస్టిస్ గజేంద్ర సింగ్లతో కూడిన ధర్మాసనం.. విడాకులకు అనుమతి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తపై భార్య క్రూరత్వం కారణంగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసిందని తెలిపింది. తన భార్య మొబైల్ ద్వారా బాయ్ఫ్రెండ్తో ఇలాంటి అసభ్యకరమైన చాటింగ్ చూసి ఏ భర్త సహించడని చెప్పింది.
పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ తమ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడే స్వేచ్ఛను కలిగి ఉంటారని పేర్కొన్న హైకోర్టు.. ఆ సంభాషణ మర్యాదగా, గౌరవంగా ఉండాలని పేర్కొంది. ఇక పురుషులతో మహిళలు.. మహిళలతో పురుషులు చాట్ చేసినపుడు ఈ సంభాషణ అభ్యంతరకరంగా ఉండొద్దని కోర్టు పేర్కొంది. జీవిత భాగస్వామిపై మరొకరికి అభ్యంతరం ఉన్నప్పటికీ అలాంటి కార్యకలాపాలను అలాగే కొనసాగిస్తే అది నిస్సందేహంగా మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
తన భార్య వాట్సాప్ చాటింగ్ అసభ్యకరంగా ఉన్నాయని భర్త ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలను భార్య ఖండించింది. తన ఫోన్ను హ్యాక్ చేసి.. తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించేందుకు తన భర్తనే ఆ మెసేజ్లను ఇద్దరు ఫ్రెండ్స్కు పంపించాడని ఆరోపించింది. తన భర్త చేసిన పని.. తన ప్రైవసీకి భంగం కలిగించాయని ఆరోపించింది. అంతేకాకుండా తన భర్త రూ.25 లక్షల కట్నం డిమాండ్ చేశాడని ఆరోపణలు చేసింది. అయితే ఆ మహిళ తండ్రి కూడా తన కుమార్తె తన బాయ్ఫ్రెండ్తో మాట్లాడేదని చెప్పడంతో కింది కోర్టు మంజూరు చేసిన విడాకులను హైకోర్టు సమర్థించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa