ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రైల్వే లైన్ల పనుల్లో వేగం పెంచే పనిలో ఉన్నారు. అలాగే రాష్ట్రంలో గతంలో ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఉత్తరాంధ్రలో కీలకమైన మరో కొత్త రైలు మార్గం ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. ఈ రైల్వే లైన్కు డీపీఆర్ విషయంలో కదలిక వచ్చింది.. కానీ ఆ తర్వాత అడుగులు ముందుకు పడలేదు. గతేడాది జూలై 29న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభలో తొలి ప్రసంగం చేసిన సమయంలో.. రాజాం ప్రాంతానికి దశాబ్దాలుగా రైల్వేలైన్ నిర్మాణం కలగానే ఉండిపోయిందని ప్రస్తావించారు. అయితే ఈ లైన్ సర్వేకు అనుమతిచ్చామని.. డీపీఆర్కు ఆమోదం తెలిపామని రైల్వేశాఖ తెలిపింది. కానీ ఎనిమిది నెలలు అవుతున్నా రైల్వేలైన్పై క్లారిటీ లేదు. దీంతో కేంద్రం ఈ రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు నుంచి రాజాం మీదుగా పార్వతీపురం లైన్కు కలుపుతూ ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు రైల్వేలైన్ నిర్మాణ సర్వేకు డీపీఆర్ను కేంద్రం ఆమోదించిన సంగతి తెలిసిందే. కొత్త ప్రణాళిక ప్రకారం.. 'విజయనగరం నుంచి రాజాం, పాలకొండ, కొత్తూరు, పర్లాకిమిడి, మెళియాపుట్టి మీదుగా పలాసకు 142 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం' చేయాలని ప్రతిపాదించారు. ఈ రైలు మార్గంతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటుగా ఒడిశాకు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే ప్రజా రవాణాతో పాటు పర్యాటకరంగం అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, గిరిజన ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్కు ఉపయోగంగా ఉంటుంది. రాజాం, పాలకొండ ప్రజలకు రైల్వే రవాణా కష్టమే.. వీరు చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు వెళ్లి రైలు ఎక్కాల్సి ఉంటుంది. రాజాం, పాలకొండ నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
పొందూరు నుంచి రాజాం మీదుగా బొబ్బిలికి ప్రత్యేక రైల్వేలైన్ నిర్మించాలన్నది ప్రతిపాదనలు వచ్చాయి.. పారిశ్రామికంగా ఎంతో వృద్ధి ఉండటంతో ఉపయోగంగా ఉంటుందని భావించారు. డీపీఆర్కు ఆమోదం తెలుపుతున్నా.. ఆ తర్వాత ఈ రైలు మార్గాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాజాం చుట్టుపక్కల జూట్, సింథటిక్, సిమెంట్, ప్లాస్టిక్, విద్యుత్ వైర్లు, పైపుల తయారీ వంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ ఏకంగా జూట్ పరిశ్రమలు ఏడు నడిచేవి. ముడిసరుకుల కొరత, రవాణా సౌకర్యం లేక పలు పరిశ్రమలు మూతపడ్డాయి. అందుకే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు రైల్వేలైన్ నిర్మాణంపై ఫోకస్ పెట్టాలి అంటున్నారు. రాజాం రైల్వే స్టేషన్ విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. రాజాం కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై త్వరలోనే స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa