వైకాపా వేలం పాటలా టిక్కెట్లు అమ్ముకుంటుంటే తెలుగుదేశంలో మాత్రం ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాగద్వేషాలు లేవని స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలుంటే రికార్డులు కూడా ఇస్తామన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించటానికి వీల్లేదని ఆదేశించారు. చింతలపూడిలో రూ.3 కోట్లు ఇస్తానంటే ఒకరికి.. అంతకంటే ఎక్కువ ఇస్తానంటే ఇంకొకరికీ అంటూ వైకాపా అభ్యర్థుల్ని మారుస్తోందని విమర్శించారు. తెదేపాలో అలాంటి పరిస్థితి లేదని.. పనిచేసిన వారితో పాటు సామాజిక న్యాయాన్నిఅభ్యర్థుల ఎంపికలో పాటిస్తున్నామని వెల్లడించారు. టిక్కెట్ ఇవ్వలేకపోతున్నాం అని తాను చెప్తే.. అర్థం చేసుకున్నాం, పార్టీ కోసం పనిచేస్తామని కొందరు స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదేనన్న చంద్రబాబు.. అందరినీ గుర్తించి భవిష్యత్తులో పదవులిస్తామని స్పష్టం చేశారు. కుటుంబం లాంటి పార్టీ కోసం ఇప్పుడు అండగా ఉన్నవారందరి భవిష్యత్తూ పార్టీ చూసుకుంటుందని స్పష్టం చేశారు. కుట్రలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు ఎంతో విజ్ఞులని.. విభజన నాటి పరిస్థితులు, నేటి పరిస్థితులను అంచనా వేసే తీర్పు ఇవ్వబోతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మూడు రోజులు ఓట్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ 28 రోజులు ఎవరికీ విశ్రాంతి, మినహాయింపు లేవని.. గెలుపే ధ్యేయంగా యుద్ధానికి సన్నద్ధం కావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa