రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందుకోసం 20,000 స్టార్టప్లను ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై పారిశ్రామికవేత్తలతో నారా చంద్రబాబు నాయుడు ఇటీవల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ' వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్ప్రెన్యూయర్ ' అనే ఏపీ ప్రభుత్వం కలను సాకారం చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను రూపొందించడంలో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, మేధావులు పాల్గొనాలని చంద్రబాబు కోరారు. అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
మరోవైపు సీఐఐ సమావేశాలు నిర్వహణ, ఇంజినీరింగ్ కళాశాలల స్థాపన, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల ఏర్పాటు హైదరాబాద్ను మార్చేశాయని చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ ఐటీ హబ్గా ఎలా మారిందో, అదే విధంగా అమరావతిని క్వాంటం వ్యాలీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సీఎంతో భేటీ సందర్భంగా వ్యాపార వేత్తలు తమ అభిప్రాయాలు వెల్లడించారు . వచ్చే ఏడాది నాటికి అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్లు బిట్స్ పిలాని వైస్ ఛాన్సలర్ వి. రామగోపాల్ రావు తెలిపారు. అలాగే అమరావతి క్వాంటం వ్యాలీలో భాగస్వామి కావడానికి ఆసక్తి చూపారు. మరోవైపు విశాఖపట్నంలో జీఎంఆర్ ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు జీఎంఆర్ గ్రూప్ అధినేత జి. మల్లిఖార్జున రావు ప్రకటించారు.
మరోవైపు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి మాట్లాడిన చంద్రబాబు.. దీనికి టాటా గ్రూప్ నాయకత్వం వహిస్తుందని తెలిపారు. ఎల్ అండ్ టీ, ఏఎంఎన్ఎస్S భాగస్వాములుగా ఉంటాయని తెలిపారు. అమరావతి కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని. దీనికి రాష్ట్రంలో ఐదు కేంద్రాలు అనుసంధానంగా ఉంటాయన్నారు. అనంతపురం కోసం జేఎస్ డబ్ల్యూ, తిరుపతి కోసం అదానీ గ్రూప్, విజయవాడ కోసం మేఘా గ్రూప్, రాజమహేంద్రవరం కోసం గ్రీన్కో, విశాఖపట్నం కోసం జీఎంఆర్ గ్రూప్ పనిచేస్తాయని చంద్రబాబు వివరించారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇంక్యుబేటర్, ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ సెంటర్, బ్యాంకింగ్ లింకేజ్, శిక్షణ, వీసీ ఫండింగ్ సపోర్ట్, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ లింకేజ్, ముడి పదార్థాల సోర్సింగ్ సపోర్ట్, ప్రోటోటైపింగ్ సెంటర్, టెస్టింగ్ ట్రాక్లు, హై-స్పీడ్ ఇంటర్నెట్ ఉంటాయని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్న చంద్రబాబు.. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రాబట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమరావతిని ఒక వినూత్న కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని .. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa