ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డోజ్ నుంచి మస్క్ ఔట్,,,,ట్రంప్ సంచలన నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 09:45 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ బాధ్యతల నుంచి ఎలాన్ మస్క్ తప్పుకోనున్నట్టు సమాచారం. మే చివరి లేదా జూన్ మొదటి వారంలో పదవి నుంచి మస్క్ వైదొలగనున్నారు. మస్క్ నేతృత్వంలోని డోజ్‌ పనితీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయనను తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) విభాగాన్ని ఆయన ఏర్పాటు చేశారు.


ఈ విభాగానికి ఎలాన్ మస్క్‌ను సారథిగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు, ఆయా శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే దీని లక్ష్యం అని ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో వివిధ విభాగాల్లోని వేలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టారు. అలాగే, అమెరికా నుంచి వివిధ దేశాలకు అందుతోన్న సాయంలోనూ కోతలు పెట్టారు. ఈ క్రమంలో మస్క్ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ యంత్రాంగాన్ని ఎలాన్ మస్క్ వెనకుండి నడిపిస్తున్నారని, షాడో అధ్యక్షుడిగా మారిపోయారని ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన శ్వేతసౌధం‘డోజ్‌లో మస్క్ ఉద్యోగి కాదు. ఆయనకు ఎటువంటి నిర్ణయాధికారాలూ లేవు’ అని తెలిపింది. ఆయన ట్రంప్ సలహాదారుడిగా మాత్రమే బాధ్యతలు చూస్తున్నారని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.


ఈ క్రమంలో మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలగనుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ట్రంప్ తన ముగ్గురు సన్నిహితులతో పాటు క్యాబినెట్‌కు చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. మస్క్ నిష్క్రమణతో ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి.


అయితే, ఈ పరిణామాలకు ముందు విస్కాన్సిన్‌లో జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌లకు గట్టి షాక్‌ తగిలింది. రిపబ్లికన్లు లక్షల డాలర్లు ఖర్చుచేసినా.. విస్కాన్సిన్‌లోని సుప్రీంకోర్టు సీటును డెమొక్రాట్ మద్దతుదారు గెలుచుకున్నారు. విస్కాన్సిన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి కౌంటీ జడ్జీలు సుసాన్‌ క్రాఫర్డ్‌ (డెమొక్రాట్లు మద్దతుదారు), బ్రాడ్‌ షీమెల్‌ (రిపబ్లికన్‌ మద్దతుదారు) పోటీ చేశారు. ఈ ఎన్నిక కోసం మస్క్ మొత్తం 21 మిలియన్‌ డాలర్లు ఖర్చుచేసినా లాభం లేకపోయింది. ఏప్రిల్ 1న జరిగిన ఎన్నికల్లో డేన్‌ కౌంటీ జడ్జి క్రాఫర్డ్‌ ఘన విజయం సాధించారు. ట్రంప్‌ పాలసీలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాలంటే సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా ఉండాలని మస్క్ భావించి.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించారు. డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసినా.. ఓటర్లు ఆయనకు షాకిచ్చారు. ఇది కూడా డోజ్ నుంచి మస్క్‌ను తప్పించడానికి బలమైన కారణంగా భావిస్తున్నారు. దీంతోపాటుగా ఉద్యోగులకు ఫిబ్రవరిలో మస్క్ పంపిన మెయిల్ కూడా తీవ్ర దుమారం రేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com