రాచకొండ కమిషనర్ పరిధిలో ఇద్దరు రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. రాచకొండ కమిషనరేట్ చరిత్రలో ఇలా నగర బహిష్కరణ చేయటం ఇదే మొట్టమొదటిసారి అని సీపీ వెల్లడించారు. దోపిడీలు, హత్యలు, అత్యాచారాలతో ప్రజలను భయపెడుతున్న ఇద్దరు రౌడీలను నగర బహిష్కరణ చేశారు. రాచకొండ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి అని సుధీర్ బాబు తెలిపారు.
ఎల్బీనగర్లో కమిషనర్ సుధీర్ బాబు ఈ విషయాలను వెల్లడించారు. సిటీ పోలీస్ యాక్ట్ 26(1) ప్రకారం నేరాలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని నగర బహిష్కరణ చేసే అధికారం ఉందని ఆయన అన్నారు. "సిటీ పోలీస్ యాక్ట్ 26(1) ప్రకారం విపరీతమైన నేరాలు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరించే అధికారముంటుంది" అని సుధీర్ బాబు తెలిపారు. మీర్పేటకు చెందిన సురేందర్, రాజేష్ అనే ఇద్దరు రౌడీ షీటర్లను బహిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో వారు కనిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
నల్గొండ జిల్లాకు చెందిన రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ (33)పై ఇప్పటికే 19 కేసులు నమోదయాయ్యాని పేర్కొన్నారు. అందులో 5 మర్డర్ కేసులు ఉన్నాయి. ఒక జంట హత్యల కేసు కూడా ఉంది. హత్యాయత్నం, దాడి, దోపిడీ కేసులు కూడా ఉన్నాయి. నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో మెంటర్ రాజేష్ మీద రౌడీ షీట్ ఉంది. పోలీసులు ఇతనిపై రెండుసార్లు పీడీ యాక్టు ప్రయోగించినా మార్పు రాలేదు. కొన్నాళ్ల క్రితం ఎల్బీనగర్కు వచ్చి గ్యాంగ్ ఏర్పాటు చేసి దందాలు మొదలుపెట్టినట్టు పోలీసులు వివరించారు.
జల్పల్లికి చెందిన సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోహీన్ (35) చిన్నప్పటి నుంచే నేరాల బాట పట్టాడు. ఇతనిపై 3 హత్య కేసులతో సహా మొత్తంగా 45 ఇతర కేసులు ఉన్నాయి. అత్యాచారం, పోక్సో, దొంగతనాలు, ఆయుధాలతో తిరగడం వంటి కేసులు కూడా ఉన్నాయి. ఎల్బీనగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్లలో ఇతనిపై కేసులు ఉన్నాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa