ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాన్స్‌-షిప్‌మెంట్ రద్దు.... బంగ్లాదేశ్‌కు గట్టి షాకిచ్చిన ఇండియా

national |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 08:30 PM

బంగ్లాదేశ్ తాత్కాలికప్రభుత్వాధినేత, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ ఇటీవలే భారత ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే  పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు భారత్ ఊహించని షాకిచ్చింది. ఆ దేశానికి కల్పించిన కీలకమైన సరుకు రవాణా మార్పిడి (ట్రాన్స్‌-షిప్‌మెంట్) సౌకర్యాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్.. భారత ఈశాన్య రాష్ట్రాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ చర్య ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది.


ఏమిటీ రవాణా సౌకర్యం? ఎందుకు రద్దు?


2020 జూన్‌లో భారత్ ఒక సర్క్యులర్ ద్వారా బంగ్లాదేశ్‌కు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. దీని ప్రకారం బంగ్లాదేశ్ తమ ఎగుమతి సరుకులను భారత భూభాగంలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా తరలించి, ఆపై భారత ఓడరేవులు లేదా విమానాశ్రయాల నుంచి మూడో దేశాలకు పంపించుకునే వీలుండేది. ముఖ్యంగా భూటాన్, నేపాల్, మయన్మార్ వంటి దేశాలతో వాణిజ్యం సులభతరం కావడానికి ఇది బంగ్లాదేశ్‌కు ఎంతగానో ఉపయోగపడింది. కానీ ఏప్రిల్ 8వ తేదీన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) 2020 నాటి ఏర్పాటును తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఇప్పటికే భారత భూభాగంలోకి ప్రవేశించిన సరుకును మాత్రం నిబంధనల ప్రకారం బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


యూనస్ వ్యాఖ్యల దుమారం..


కొద్ది రోజుల క్రితం బీజింగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ.. భారతదేశపు తూర్పు భాగం, సెవెన్ సిస్టర్స్ (ఏడు ఈశాన్య రాష్ట్రాలు), పూర్తిగా భూపరివేష్టిత ప్రాంతం అని అన్నారు. వారికి సముద్రంలోకి వెళ్లే మార్గమే లేదని తెలిపారు. బంగ్లాదేశ్ మాత్రమే వారి సముద్రానికి ఏకైక సంరక్షకుడు (guardian of the ocean) అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చైనా తన ఆర్థిక కార్యకలాపాలను విస్తరించుకోవడానికి ఇదే అవకాశమని పరోక్షంగా ఆహ్వానించారు.


భారత్ గట్టి కౌంటర్..


ముహమ్మద్ యూనస్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత దౌత్య వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ముఖ్యంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ కామెంట్లను తీవ్రంగా ఖండించారు. బంగాళాఖాతంలో అత్యంత పొడవైన తీరరేఖ భారత్ కే ఉందని.. అలాగే ఈశాన్య ప్రాంతం బిమ్స్‌టెక్ దేశాలకు ఒక ప్రధాన అనుసంధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. యూనస్ వాదనల్లో ఏమాత్రం పసలేదని కొట్టిపారేశారు. భారతదేశ వ్యూహాత్మక, ప్రాంతీయ అనుసంధాన సామర్థ్యాన్ని ఆయన నొక్కి చెప్పారు.


భారత ఎగుమతిదారుల హర్షం..


ఈ రవాణా సౌకర్యంపై భారత ఎగుమతిదారులు, ముఖ్యంగా వస్త్ర (అపెరల్) రంగం వారు మొదటి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఛైర్మన్ సుధీర్ సేఖ్రి గతంలో మాట్లాడుతూ.. రోజుకు 20-30 బంగ్లాదేశ్ ట్రక్కులు ఢిల్లీకి వస్తుండటంతో కార్గో టెర్మినళ్లు కిక్కిరిసిపోతున్నాయని చెప్పారు. దీని వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ భారత్ తీసుకున్న తాజా నిర్ణయంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్  డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ దీనిపై స్పందిస్తూ.. ఇప్పుడు తమ సరుకు రవాణాకు విమానాల్లో ఎక్కువ స్థలం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గతంలో బంగ్లాదేశ్‌కు ఇచ్చిన ఈ సౌకర్యం వల్ల తమకు స్థలం దొరకడం లేదని ఎగుమతిదారులు ఫిర్యాదు చేసేవారని అన్నారు.


బంగ్లాదేశ్‌కు నష్టమేనా..?


గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ఎగుమతి లాజిస్టిక్స్‌ను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఉన్న విధానం ద్వారా భారత్ సులభమైన మార్గాన్ని అందించిందని.. దీనివల్ల బంగ్లాదేశ్ కు రవాణా సమయం, ఖర్చు తగ్గాయని చెప్పారు. కానీ ఇప్పుడీ సౌకర్యం లేకపోవడంతో బంగ్లాదేశ్ ఎగుమతిదారులు జాప్యం, అధిక ఖర్చులు, అనిశ్చితిని ఎదుర్కునే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.


డబ్య్లూటీఓ నిబంధనల ప్రశ్నార్థకం?


భారత్, బంగ్లాదేశ్ రెండూ ప్రపంచ వాణిజ్య సంస్థ  సభ్య దేశాలు కావడంతో.. ఈ చర్య రవాణా హక్కులకు సంబంధించిన డబ్య్లూటీఓనిబంధనలపై ఆందోళనలు రేకెత్తించవచ్చని శ్రీవాస్తవ హెచ్చరించారు. ముఖ్యంగా ఈ మార్గాన్ని పరోక్షంగా ఉపయోగించుకునే నేపాల్, భూటాన్ వంటి ఇతర భూపరివేష్టిత దేశాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. అమెరికా ఇటీవలే భారత్, బంగ్లాదేశ్ రెండింటిపైనా కొత్త టారిఫ్‌లను ప్రకటించిన నేపథ్యంలో, పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతల మధ్య ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.


మొత్తం మీద, యూనస్ వ్యాఖ్యలు తక్షణ కారణంగా కనిపిస్తున్నప్పటికీ, భారతీయ వాణిజ్య వర్గాల ఒత్తిడి, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇరు దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa