అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు పెంచుతానన్న తన బెదిరింపులను నిజం చేశారు. తన హెచ్చరికలను డ్రాగన్ పట్టించుకోకపోవడంతో, చైనా వస్తువులపై భారీగా సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై సుంకాలు మొత్తం 104 శాతానికి చేరాయి. ఈ కొత్త సుంకాలు ఏప్రిల్ 9నుంచి అమలులోకి వస్తాయని శ్వేతసౌధం తెలిపింది. ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో టారిఫ్లను ప్రకటించిన ట్రంప్.. చైనాపై 34 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికాపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది.
చైనా నిర్ణయంపై తీవ్రంగా మండిపడిన ట్రంప్.. ఏప్రిల్ 8లోగా తన నిర్ణయాన్ని డ్రాగన్ వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేకపోతే, అదనంగా 50 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులకు చైనా స్పందించకపోవడంతో.. అదనంగా 50 శాతం సుంకాలు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. ట్రంప్ నిర్ణయంపై చైనా ఇంకా స్పందించలేదు. వాణిజ్య భాగస్వామ్య దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు వేసి తమ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. అన్ని దేశాలు తమ వస్తువులపై సుంకాలు తగ్గించాలని ఆయన కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకం విధించింది. ఇటీవల పెంచిన సుంకంతో కలిపి, చైనాపై మొత్తం సుంకం 54 శాతానికి చేరుకుంది. ఇప్పుడు మరో 50 శాతం పన్నులు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. వారం వ్యవధిలోనే చైనపై మొత్తం సుంకాలు 104 శాతానికి చేరుకోవడం గమనార్హం. కానీ, చైనాకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయనే సంకేతాలు ఇచ్చారు. తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టిన ట్రంప్.. చైనా కూడా తమతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోందని, కానీ దానిని ఎలా ప్రారంభించాలో వారికి తెలియదని, వారి పిలుపు కోసం తాను ఎదురుచూస్తున్నానని అన్నారు.
అధిక సుంకాలతో తమను బీజింగ్ దోపిడీ చేసిందని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు. మరోవైపు, సుంకాలపై తాము చివరి వరకూ పోరాడుతామని ఇదివరకే చైనా ప్రకటించింది. ట్రంప్ హెచ్చరికలను బ్లాక్మెయిల్గా అభివర్ణించింది. ‘చైనాపై సుంకాలు పెంచాలనే అమెరికా బెదిరింపులకు పాల్పడి తప్పులు మీద తప్పు చేస్తోంది.. ఇది అమెరికా బ్లాక్మెయిలింగ్ స్వభావాన్ని మరోసారి బయటపెట్టింది.. అమెరికా తన దారికి తెచ్చుకోవాలని భావిస్తే, చైనా చివరి వరకు పోరాడుతుంది’ ’ అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa