ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి వడివడిగా అడుగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 05:57 PM

ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తీర ప్రాంతంలోని పర్యాటక స్థలాలతో పాటుగా ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. అంతెత్తున ఉన్న కొండల మధ్యన వేలాడుతూ గాలిలో విహారం.. తలుచుకుంటేనే ఓ రకమైన థ్రిల్లింగ్ ఫీలింగ్‌. అలాంటి ఫీలింగ్ వచ్చే రోజుల్లో మీరు కూడా అనుభవింవచ్చు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఏపీ పర్యాటక రంగం అభివృద్ధికి ఊతమిచ్చేలా కీలక అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు చోట్ రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఏపీలో రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీలో కన్సల్టెన్సీ సర్వీసుల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ బిడ్లను ఆహ్వానిస్తోంది.


ఏపీలోని ఐదు ప్రాంతాల్లో రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణానికి గానూ డీపీఆర్ తయారీకి టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఈ ఐదులో చిత్తూరు జిల్లా్లోని బోయకొండ గంగమ్మ ఆలయం, కర్నూలు అహోబిలం దేవస్థానం, పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ, విజయవాడలోని భవానీ ద్వీపం, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద దిగువ ఆలయం నుంచి హిల్ టాప్ వరకూ 0.68 కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. అలాగే అహోబిలం దేవస్థానం వద్ద.. ఎగువ అహోబిలం నుంచి జ్వాల నరసింహస్వామి ఆలయం వరకూ 1.28 కిలోమీటర్లు.. కోటప్పకొండ వద్ద కొండ దిగువ నుంచి ఎగువకు, పాత దేవాలయం వరకూ 1.23 కిలోమీటర్ల మేరకు రోప్‌వే నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి.


అలాగే విజయవాడలో కృష్ణా నది మీదుగా బెర్మ్ పార్క్ నుంచి భవానీ ఐలాండ్ వరకూ 0.85 కిలోమీటర్ల మేరకు రోప్‌వే నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆలయం ముందు నుంచి శిఖరాగ్రం వరకూ 0.25 కిలోమీటర్లు రోప్‌వే ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‍ల తయారీలో కన్సల్టెన్సీ సేవల కోసం నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ టెండర్లను ఆహ్వానిస్తున్నారు.


 మరోవైపు ఏపీలోని 25 పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పర్యాటకులతో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఏపీటీడీసీ ఈ ఆలోచనలు చేస్తోంది. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాల వద్ద రోప్‍వేలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీటీడీసీ ఉన్నట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa