ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరనేది రాజ్ కసిరెడ్డినే అడగాలన్న విజయసాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 07:51 PM

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి సిట్ విచారణ ముగిసింది. దాదాపు 3 గంటల పాటు ఆయనను సిట్ అధికారులు విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను సిట్ అధికారులు నాలుగు విషయాల గురించి అడిగారని తెలిపారు. తాను ఇచ్చిన సమాధానాలతో వారు తృప్తి చెందారనే అనుకుంటున్నానని చెప్పారు. గతంలో జరిగిన రెండు సమావేశాల గురించి అడిగారని ఆ రెండు సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఏం చర్చించారు, ఎవరెవరు పాల్గొన్నారని అడిగారని విజయసాయి తెలిపారు. తొలి సమావేశం హైదరాబాద్ లో, రెండో సమావేశం విజయవాడలో జరిగిందని సమావేశాల్లో లిక్కర్ పాలసీపై చర్చించామని చెప్పానని వెల్లడించారు. ఈ సమావేశాల్లో వాసుదేవరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, సత్య ప్రసాద్, సజ్జల శ్రీధర్ పాల్గొన్నారని చెప్పానని తెలిపారు.  కిక్ బ్యాక్స్ గురించి అడిగితే తెలియదని చెప్పానని అన్నారు. ఏ కంపెనీలనైనా సిఫారసు చేశారా? అని అడిగారని రెండు కంపెనీలకు సిఫారసు చేశానని చెప్పానని తెలిపారు. అదాన్ డిస్టిలరీకి రూ. 60 కోట్లు, డీకార్ట్ కంపెనీకి రూ. 40 కోట్లు ఆరబిందో కంపెనీ నుండి 12 శాతం వడ్డీతో రుణం ఇప్పించానని నిధుల వినియోగం గురించి తనకు తెలియదని చెప్పానని అన్నారు. ఆ ఫండ్స్ ఎలా వాడుకున్నారు, ఎలా రీఫండ్ చేశారనే విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలరని తెలిపానని వెల్లడించారు.మద్యం అమ్మకాల విషయంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని చెప్పానని తెలిపారు. రాజ్ కసిరెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎవరికి వెళ్లాయో తనకు తెలియదని చెప్పానని అన్నారు. అన్ని ప్రశ్నలకు రాజ్ కసిరెడ్డే సరైన సమాధానాలు చెబుతారని చెప్పానని తెలిపారు. రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయని, విచారణకు మళ్లీ ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పానని తెలిపారు.లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరనేది రాజ్ కసిరెడ్డినే అడగాలని విజయసాయి చెప్పారు. 2017-18లో పార్టీలోకి రాజ్ కసిరెడ్డి వచ్చారని ఆయన చాలా తెలివైన క్రిమినల్ అని అన్నారు. ఆయన అలాంటి వాడు కాదనే తాను అయన్ను ఎంకరేజ్ చేశానని తెలిపారు. ఆయనకు ఎన్ఆర్ఐ విభాగం, ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ బాధ్యతలను అప్పగించానని కానీ ఆయన పార్టీని, ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు.జగన్ పక్కనున్న కోటరీ తనపై లేనిపోనివి చెప్పి ఆయన మనసు మార్చిందని విజయసాయి మండిపడ్డారు. కోటరీ వేధింపులు భరించలేకపోయానని వారి వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు. వైసీపీలో తన నెంబర్ టూ స్థానం 2 వేల స్థానానికి పడిపోయిందని అన్నారు. వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తికి రాజకీయాలు ఎందుకని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని తాను ఎంపీ పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని చెప్పారు. తాను అడగకుండానే తనకు రాజ్యసభ పదవి వచ్చిందని తెలిపారు. మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తనకు ఇతరుల అనుమతి అవసరం లేదని ప్రజలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. వారి సొంత న్యూస్ ఛానల్లో తనపై వ్యంగ్యంగా కథనాలు రాస్తున్నారని విమర్శించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa