ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు .. సెలవులపై కీలక నిర్ణయం, ఉత్తర్వులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 07:54 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మహిళా ఉద్యోగుల ప్రొబేషన్‌ ప్రకటనకు ప్రసూతి సెలవులను లెక్కించేందుకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు ప్రసూతి సెలవులు తీసుకున్నా ప్రొబేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం తెలిపింది. ఈ సెలవులను లెక్కలోకి తీసుకొని ప్రొబేషన్‌ ప్రకటిస్తారన్న మాట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహిళా దినోత్సవం రోజున ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రసూతి సెలవుల అంశంపై క్లారిటీ ఇచ్చారు.


 రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులు ఇస్తా­మని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో తానే జనాభా నియంత్రణ పాటించాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ముఖ్యమంత్రి.. అయితే భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని తానే ఇప్పుడు చెబుతున్నానన్నారు. 'ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరి వరకే ప్రసూతి సెలవులిస్తున్నాం. ఇకపై ఎంత మంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు ఇస్తాం. ఇతర ప్రయోజనాలనూ కల్పిస్తాం' అన్నారు. అందుకే ఎంతమంది పిల్లలను కన్నా సరే ప్రభుత్వ మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా చూస్తానన్నారు. దేశం కోసం గతంలో అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పిల్లలను కనాలని చెబుతున్నాను.


మే 8న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో భేటీ నిర్వహిస్తారు. ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను శాఖల వారీగా మే 6 లోపు సాధారణ పరిపాలనశాఖలో అందజేయాలని సీఎస్‌ కె.విజయానంద్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి, మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.


మరోవైపు రాష్ట్రంలోని ప్రత్యేక జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌(క్లాస్‌-2)ల గౌరవ వేతనాన్ని రూ.30వేల నుంచి రూ.45వేలకు పెంచుతున్నట్టు మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. రవాణా ఖర్చుల కింద అదనంగా రూ.5వేలు చెల్లించనున్నట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గౌరవవేతనం పెంపు 2019 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని వెల్లడించారు. గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో 516.58 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖకు కేటాయించింది. ఎకరా రూ.27 లక్షల చొప్పున మొత్తం రూ.139.47 కోట్ల ధరకు ఈ భూమి ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa