జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో, ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల భద్రతకు ఎలాంటి లోపం రాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు.తిరుమలకు ప్రధాన ప్రవేశ మార్గమైన అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతను గణనీయంగా పెంచారు. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లపై ప్రయాణించే వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు వాహనాలతో పాటు, భక్తులు తీసుకువచ్చే లగేజీని కూడా భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘాట్ రోడ్డు మధ్యలో కూడా తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచారు.అవాంఛనీయ సంఘటనలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధతలో భాగంగా పోలీసు, టీటీడీ విజిలెన్స్, ప్రత్యేక ఆక్టోపస్ బలగాలు సంయుక్తంగా ఒక మాక్ డ్రిల్ను నిర్వహించాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, భక్తులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అనే అంశాలపై ఈ డ్రిల్ సాగింది.శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ మాడ వీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పరిసరాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. 24 గంటల పాటు నిరంతర నిఘా కొనసాగిస్తూ, భక్తులు ప్రశాంతంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa