దళారీ వ్యవస్థ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేసేందుకు ఆనాడు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆప్కాస్ను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్రెడ్డి ఆగ్రహం చేశారు. తిరుపతిలోని వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తనకు అనుకూలమైన ఏజెన్సీలకు దోచిపెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. చిరుద్యోగుల పొట్టకొట్టేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.... 2019లో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం పొందాలంటే లంచాలివ్వాల్సి వచ్చేది. రెగ్యులర్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఐదారు నెలలకోసారి జీతాలిచ్చేవారు. ప్రతినెలా వచ్చే జీతంలోనూ కమీషన్లు ఇవ్వాల్సి వచ్చేది. కష్టపడి పనిచేస్తున్నా జీతభత్యాల విషయంలో నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ఇలాంటి సమస్యల నుంచి వారిని బయటపడేసేలా నాటి సీఎం వైయస్ జగన్ 2019 డిసెంబర్ 19న ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు (ఆప్కాస్) చేసి జూలై 3, 2020న ప్రారంభించారు. అదేరోజున 47 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ చేసిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోతల్లేకుండా ప్రతినెలా ఒకటో తేదీనే చెల్లింపులు జరిగేవి. ఈఎస్ ఐ, ఈపీఎఫ్ జమ చేయడం జరిగేది. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా వేతనాలు పొందేవారు. ఈ ఉద్యోగుల్లో 50 శాతం మంది మహిళలతోపాటు ఎస్సీఎస్టీ బీసీ ఉద్యోగుల నియామకం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకిచ్చిన హామీలను పూర్తిగా గాలికొదిలేశారు అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa