ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. రూ.30 వేలకోట్ల పెట్టుబడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 09:25 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు కొలువుదీరటంతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే కళ్యాణి స్టీల్స్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట సమీపంలో కళ్యాణి స్టీల్స్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కళ్యాణి స్టీల్స్ ప్రతినిధులు కూడా ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించారు. రెవెన్యూ అధికారులతో కలిసి మూలపేట సమీపంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. రైలు, రోడ్డు, విద్యుత్, నీటి సదుపాయాలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయనే దానిపైనా పరిశీలన జరిపారు.


మరోవైపు రూ.30వేల కోట్లతో వేయి ఎకరాల్లో కల్యాణి స్టీల్స్‌ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే పుణె నుంచి కల్యాణి స్టీల్స్‌ సంస్థ హెచ్‌ఆర్‌, లాజిస్టిక్‌ మేనేజర్‌, ఇతర నిపుణులు.. స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి మూలపేటను సందర్శించినట్లు సమాచారం. మూలపేట సమీపంలోని సమీర్‌పేట లాజిస్టిక్స్‌‌కు చెందిన 1000 ఎకరాలను ఈ బృందం పరిశీలించింది. ఈ ప్రాంతంలో అయితే గొటా బ్యారేజ్‌ నుంచి నీటిని, రావివలస సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అందించేందుకు అవకాశం ఉందని కళ్యాణి స్టీల్స్ సంస్థ ప్రతినిధులకు వివరించారు. అలాగే భావనపాడు తీరం, ఈస్ట్‌కోస్ట్‌ పవర్‌ప్లాంట్‌ భూములను కూడా కళ్యాణి స్టీల్స్ ప్రతినిధులు పరిశీలించారు.


మరోవైపు ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్పెషాలిటీ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో పాటుగా, టైటానియం మెటల్, ఏరోస్పేస్ కాంపోనెంట్స్ తయారీ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు కళ్యాణి స్టీల్స్ లిమిటెడ్ ఒడిశా ప్రభుత్వంతో ఇప్పటికే అవగాహన ఒప్పందం చేసుకుంది. దెంకనల్‌ జిల్లాలోని గజమారాలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా 10,000 ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అక్కడి ప్రభుత్వం చెప్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కళ్యాణి స్టీల్స్ స్పెషాలిటీ స్టీల్, ఆటో విడిభాగాల యూనిట్ కోసం రూ.6,626 కోట్లు.. ఏరోస్పేస్, రక్షణ భాగాల యూనిట్ కోసం రూ. 5,124 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిసింది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట ప్రాంతాన్ని కళ్యాణి స్టీల్స్ సంస్థ ప్రతినిధులు పరిశీలించడంతో.. ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తారా అనే ఆసక్తి నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa